కనిపించుటలేదు!
posted on Nov 14, 2013 5:45PM
ఉండవల్లి అరుణ్కుమార్, లగడపాటి రాజగోపాల్ అనే ఇద్దరు రాజకీయ నాయకులు గతంలో ప్రతిరోజూ మీడియాలో కనిపించేవారు. తెలంగాణ రాదు.. సీమాంధ్రులకేం భయంలేదు.. తెలంగాణ రాకుండా చేసే సత్తా మాకు వుందని చెప్పేవారు. వీళ్ళమాటలు నమ్మి సీమాంధ్రులు దారుణంగా మోసపోయారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడానికి మహా ఆత్రంగా పరిగెత్తుతున్న ప్రస్తుత తరుణంలో వారం పది రోజులకు ఒకసారి కూడా వీళ్ళు మీడియాలో కనిపించడం లేదు. అలాగే సీమాంధ్రలో కూడా వీళ్ళు ఎక్కడా కనిపించడం లేదు. వీళ్ళ నియోజకవర్గాల ప్రజలకయితే అస్సలు కనిపించడం లేదు. ఈ క్రింది ఆధారాలతో వీళ్ళిద్దర్నీ గుర్తుపట్టవచ్చు. వీళ్ళలో ఉండవల్లి అనే వ్యక్తి చాలా మాటకారి. మాటలతోనే కడుపు నింపేస్తూ వుంటాడు. లాపాయింట్లు తీస్తూ వుంటాడు. అస్సలు కోపాన్ని ప్రదర్శించకుండా చిరునవ్వుతో వుంటాడు. ఈయన న్యూఢిల్లీలో సోనియాగాంధీ ఇల్లు, ఎఐసీసీ ఆఫీసు పరిసరాల్లో తిరుగుతూ వుండొచ్చు.
అలాగే లగడపాటి రాజగోపాల్ చూడ్డానికి స్పోర్ట్స్ మాన్లాగా వుంటాడు. జేబులో ఎప్పుడూ డబ్బుల కట్టలు పెట్టుకుని వుంటాడు. దేన్నయినా డబ్బుతో కొనేయొచ్చన్న ఆత్మవిశ్వాసం ముఖంలో కనిపిస్తూ వుంటుంది. ఒక్కసారి మాట్లాడ్డం మొదలుపెడితే ఎంతసేపయినా నాన్స్టాప్గా మాట్లాడుతూనే వుంటాడు. ఈయన కూడా ఉండవల్లి కనిపించే ఏరియాల్లోనే కనిపించే ఛాన్సుంది. వీళ్ళిద్దరూ ఉండవల్లి, లగడపాటి అని షార్ట్ కట్ పేర్లతో పిలిస్తే పలుకుతారు. వీళ్ళు ఎవరికైనా కనిపిస్తే దయచేసి మాకు మాత్రం అప్పగించవద్దు. వాళ్ళని తీసుకెళ్ళి వేరే ఏదైనా స్టేట్లో వదిలేయగలరు.
మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళవద్దని బెదిరించగలరు. వాళ్ళు కనిపించకుండా వుంటేనే మాకు హాయిగా వుంది. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు రాకుండా చేసిన వాళ్ళకి మంచి బహుమతి అందించగలం. బాబూ ఉండవల్లీ, నాయనా లగడపాటీ.. మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్కి రాకండి. వచ్చి మా చెవుల్లో మళ్ళీ పూలు పెట్టే ప్రయత్నం చేయకండి. మిమ్మల్ని నమ్మి ఆల్రెడీ ఒకసారి మోసపోయాం. మమ్మల్ని మళ్ళీ మోసం చేయకండి.
ఇట్లు
సీమాంధ్ర ప్రజలు