డోన్‌లో మాస్ అసెంబ్లీ

 

ఆవు చేలో మేస్తే  దూడ గ‌ట్టున మేస్తుందా..!  అమ‌రావ‌తి అసెంబ్లీలో  నేత‌లు నువ్వా-నేనా  అంటూ స‌వాళ్ల‌తో స‌భా స‌మయాన్ని ఖూనీ చేస్తుంటే..  క‌ర్నూలు జిల్లా డోన్‌లో  మాస్ అసెంబ్లీతో చెల‌రేగిపోయారు కార్య‌క‌ర్త‌లు.  ఈ చానెల్ ఆ చానెల్ అనే తేడాలేకుండా అన్ని  టీవీల్లో..అంతెందుకు నేష‌న‌ల్ మీడియాలో కూడా  డోన్ దెబ్బ‌కు బ్రేకింగ్ న్యూస్‌లు బొబ్బ‌పెట్టాయి.  ఒక  కొట్టుడా.. ఒక తిట్టుడా..

 

అన్ని భాషాల్లోనే తిట్ల‌ను క‌ల‌గ‌లిపి ..రాంగోపాల్ వ‌ర్మ ర‌క్త‌చ‌రిత్ర సీను ర‌క్తిక‌ట్టించారు   టీడీవీ,  వైసీపీ వ‌ర్గీయులు. ప‌ర‌స్ప‌ర దాడుల‌తో పంబ‌రేపారు. పోలీసులున్నా స‌రే ప‌హిల్వాన్‌లా రెచ్చిపోయారు. ఖాకీల‌ను ఏమాత్రం ఖాత‌ర్ చేయ‌కుండా    ఈ వ‌ర్గం వాళ్లు ఆ వ‌ర్గంపై  ..ఆ వ‌ర్గం వాళ్లు ఈ వ‌ర్గంపై క‌ర్ర‌లు..రాడ్ల‌తో దాడికి పాల్ప‌డ్డారు.  త‌ల‌లు ప‌గిలాయి..చేతులు కాళ్లు విరిగాయి..నెత్తురు చిందింది..

 

అది మాములు కొట్టుకునుడు కాదు. సినిమాల్లోకూడా  ఈ త‌ర‌హా కుమ్ముడు ఉండ‌దు.రక్త‌చ‌రిత్ర తెర‌క‌ర్త  రాంగోపాల్‌వ‌ర్మ్  బ్రెయిన్ కూడా  అంద‌ని ఫైటింగ్ సీన్ల‌తో ఠారెత్తించారు.  అచ్చంగా  అమరావ‌తి  అసెంబ్లీ త‌ర‌హాలోనే  డోన్ మాస్ అసెంబ్లీలోనూ  అధికార ప‌క్షానిదే కూసింత పై చేయి అయింది. టీడీపీ వ‌ర్గీయుల క‌న్నా  వైసీపీ కార్య‌క‌ర్త‌లే ఎక్కువ గాయ‌ప‌డ్డారు. అక్క‌డ‌  అగ్రిమంట‌ల్లో వేలుపెట్టి  జ‌గ‌న్ సెల్ఫ్‌గోల్‌లో ప‌డితే.. ఇక్క‌డ  రింగ్ లోకి ఎంట్రీ ఇచ్చి గాయాల‌తో ఆసుప‌త్రి పాల‌య్యారు వైసీపీ నేత‌లు. డోన్‌లో   టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ వ‌ర్గీయులు దాడి రాంగోపాల్ వ‌ర్మ ర‌క్త‌చరిత్ర మించిన లైవ్లీ సీన్లు  మీడియాలో లైవ్‌క‌వ‌రేజ్‌లో దుమారం రేపాయి. డ్రోన్ కెమెరాల‌క్క‌ర్లేకుండానే డోన్‌లో  సీన్‌సితార్ చేశారు. స‌భ లోప‌లోనైనా..  స‌భ బ‌య‌టైనా  అధికార‌ప‌చ్చానిదే అప్ప‌ర్ హ్యాండా?  అదే ప‌వ‌ర్‌కున్న ప‌వ‌ర్‌.