మా బాస్‌లు ఢిల్లీల్లో కాదు.. గల్లీల్లో ఉన్నారు

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మీకు లాగా మా బాస్‌లు ఢిల్లీలో లేరని.. బాన్సిలాల్ పేట గల్లీల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని.. పేదల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలోని రహదారులు దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. దెబ్బతిన్న రోడ్లను మరమ్మత్తులు చేసేందుకు గాను రూ.77 కోట్లు విడుదల చేశామన్నారు. కార్యక్రమంలో మంత్రులు లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.