తెలంగాణాలో టీడీపీ తరుపున కొడాలి నాని ప్రచారం

 

కొడాలి నానికి మొదటినుంచి నందమూరి కుటుంబంతో మంచి అనుబంధముంది. ముఖ్యంగా ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ అంటే కొడాలి నానికి అమితమైన గౌరవం, అభిమానం. జూనియర్ ఎన్టీఆర్ కి కూడా కొడాలి నాని మంచి స్నేహితుడు. నందమూరి కుటుంబంతో ఉన్న ఆ అనుబంధంతోనే అప్పుడు నానికి టీడీపీ గుడివాడ టికెట్ ఇచ్చారనే అభిప్రాయం ఉండేది. అయితే నాని గుడివాడలో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్ ని క్రియేట్ చేసుకొని గుడివాడలో తిరుగులేని నేతగా ఎదిగారు. టీడీపీలో మంచిపేరు తెచ్చుకున్నారు. తరువాత కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయినా ఆయనకి నందమూరి కుటుంబం మీద అభిమానం ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. హరికృష్ణ మరణించిన సమయంలో ఓ వైవు బాధపడుతూనే మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఓ స్నేహితుడిలా అండగా ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా హరికృష్ణ కుటుంబం మీద ఉన్న అభిమానం పోదని రుజువు చేసుకున్నారు. అయితే ఇప్పుడు నాని హరికృష్ణ కుటుంబం కోసం తెలంగాణలో టీడీపీ తరుపున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో డిసెంబర్ 7 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి నువ్వా నేనా అన్నట్టు పోరుకి సిద్ధమయ్యాయి. ఈ కూటమిలో పొత్తులో భాగంగా టీడీపీకి 14 స్థానాలు కేటాయించారు. వాటిలో కూకట్ పల్లి కూడా ఉంది. చంద్రబాబు కూకట్ పల్లి నుంచి అనూహ్యంగా హరికృష్ణ కూతురు సుహాసినిని బరిలోకి దించారు. సుహాసిని గెలవాలని మహాకూటమి ఎంత బలంగా కోరుకుంటుందో.. కొడాలి నాని కూడా అంతే బలంగా కోరుకుంటున్నారట. హరికృష్ణ కూతురి గెలుపు కోసం తనవంతుగా ప్రచారం చేయాలని నాని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ విషయాన్ని తమ పార్టీ అధినేత జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. అయితే జగన్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదని తెలుస్తోంది. అయినా కొడాలి నాని మాత్రం తాను ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి కొడాలి నాని నిజంగా ప్రచారం చేయాలనుకుంటున్నారో లేదో తెలీదు కానీ టీడీపీ శ్రేణులు మాత్రం దీన్ని వ్యతిరేకించే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఏపీలో టీడీపీ, వైసీపీ ప్రత్యర్థులు. అలాంటిది టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నేత ప్రచారానికి వస్తా అంటే టీడీపీ ఒప్పుకుంటుందా? కష్టమే. మరోవైపు కొడాలి నాని కూడా ప్రచారానికి రావడం అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఆయన ప్రచారానికి రావాలనుకుంటున్నారన్న వార్తలు వస్తేనే.. నందమూరి అభిమానుల ఓట్ల కోసమే నాని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదీగాక తెలంగాణలో టీడీపీ తరుపున ప్రచారం చేస్తే టీడీపీని పొగడాలి, కేసీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడాలి. దీనివల్ల టీడీపీ వ్యతిరేకంగా, కేసీఆర్ కి సన్నిహితంగా ఉంటున్న వైసీపీకి కష్టాలు తప్పవు. మరి ఇన్ని ప్రతికూలతల నడుమ నాని కూకట్ పల్లిలో టీడీపీ తరుపున ప్రచారం చేస్తారో లేదో చూడాలి.