అంటే.. కిరణ్ ఉద్దేశమేంటి?

 

 

 

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి తన ఆనందాన్ని అణుచుకోలేని పరిస్థితిని చవిచూశారు. ప్రమాణ స్వీకారం చేసిన నెలా పదిహేను రోజుల నుంచే ముఖ్యమంత్రి మార్పు ఖాయమన్న వార్తలు వచ్చిన పరిస్థితి నుంచి మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి బాధ్యతలు ఆయన విజయవంతంగా నిర్వహించారు. ఇది రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు.. స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం.

 

కిరణ్‌కి ముఖ్యమంత్రి పదవి  దక్కడమే ఒక బోనస్ అయితే, ఆ బోనస్ మూడేళ్ళపాటు లాకౌట్ కాకుండా వుండటం విశేషమే. దానికితోడు ముఖ్యమంత్రి పదవి నాకు ముఖ్యం కాదని అని అధిష్ఠానానికి వ్యతిరేకంగా గళమెత్తినా పదవి పోలేదంటే అంతకంటే ఆనందం మరొకటి వుంటుందా? ఆ ఆనందంలో తానేం మాట్లాడుతున్నాడో కూడా మరచిపోయి ముఖ్యమంత్రి మాట్లాడేశారు. మూడేళ్ళ ముచ్చట ముగిసిన రోజున ఆయన రాయచోటిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.




ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగితే అసలు గొడవే వుండేది కాదు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేసరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా వుందని, అప్పటికి నాలుగు సంవత్సరాల ముందు వరకూ కూడా పథకాలు సక్రమంగా అమలు కాక ఎన్నో బకాయిలు వుండిపోయాయని, అలాంటి ఘోరమైన పరిస్థితులన్నీ తాను రాగానే చక్కదిద్దానని ఆయన చెప్పుకున్నారు. ఇది పైకి చాలా సింపుల్ విషయంలా కనిపించినా, కాంగ్రెస్ పార్టీకే పెద్ద డ్యామేజ్ లాంటి విషయం.




కిరణ్ చెప్పిన మాటల ప్రకారం, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, రోశయ్య ముఖ్యమంత్రిగా వున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరమ అధ్వాన్నంగా వున్నట్టు! డబ్బులు లేక కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన గుడ్డ వేసుకుని కూర్చున్నట్టు! కిరణ్ గారు వచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు!! ఎవరైనా కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ గత ప్రభుత్వం నాసిరకం ప్రభుత్వం.. మా ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అని చెప్పుకుంటారు. కిరణ్ కుమార్ మాత్రం తన కాంగ్రెస్ ప్రభుత్వాలనే తిట్టిపోశారు. ఈ విషయాన్ని ఎలా రాజకీయం చేద్దామా అని ముఖ్యమంత్రి వ్యతిరేకులు ఆలోచిస్తున్నట్టు సమాచారం.