జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా: కేశినేని నాని

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు ఆయన నివాసంలో పరామర్శించారు. వారిలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, వంగలపూడి అనిత, గద్దె అనురాధ, గొట్టిపాటి రామకృష్ణ తదితరులు ఉన్నారు.

కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. సౌమ్యుడైన కొల్లు రవీంద్ర అక్రమ అరెస్ట్ రాక్షసమైన కుట్రపూరిత చర్య అని మండిపడ్డారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. హిట్లర్ యూదులను అణచివేయాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని అన్నారు. అలాగే ఏ వర్గాన్ని కానీ, ఏ పార్టీని కానీ అక్రమ పద్ధతుల్లో అణచివేయడం మీ వల్ల కాదని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను అన్నారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్న బీసీ వర్గాలను అక్రమ పద్ధతుల ద్వారా అణచివేయాలనుకోవడం అమానుషం. యావత్ తెలుగుదేశం పార్టీ వారందరికీ అండగా ఉంటుందని తెలిపారు. వైసీపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని లు ప్రతి రోజు కోట్లాది రూపాయల ఇసుకను అక్రమంగా జగ్గయ్యపేట నుండి హైద్రాబాద్ కు తరలిస్తున్న సంగతి ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. అధికారులు న్యాయానికి, ధర్మానికి విధేయులుగా ఉండాలి తప్ప, అధికార పక్షానికి కాదని గ్రహించాలని కేశినేని నాని హితవు పలికారు.

రాష్ట్ర టీడీపీ మహిళ అధ్యక్షురాలు, వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఇలాంటి కుట్రపూరిత వ్యవహారశైలిని ఎప్పుడూ చూడలేదన్నారు. అన్యాయంగా టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ అరెస్టుల ద్వారా ఇంట్లో ఉండే ఆడవాళ్లు ఇబ్బందులు పడుతున్నారని, మహిళల పట్ల మీ వైఖరి మార్చుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. కొల్లు రవీంద్ర గారు చాలా మంచి వ్యక్తి. అన్ని విధాలా టీడీపీ, ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని అనిత స్పష్టం చేశారు.