అరెస్ట్.. విడుదల.. మళ్ళీ రాముడి గురించి వ్యాఖ్యలు!! 

 

ఇటీవల ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కత్తి మహేష్.. శ్రీ రాముడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. అయితే సోమవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులు మహేష్ ని అరెస్ట్ చేసి ఆ వ్యాఖ్యల గురించి వివరణ కోరినట్టు తెలుస్తుంది.. అదేవిధంగా అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి వుంటుందని చెబుతూ నోటీసులు ఇచ్చి మహేష్ ని పంపించారు. ఈ అరెస్ట్, విడుదల గురించి కత్తి మహేష్ సోషల్ మీడియాలో స్పందించారు.. 'కేసుకు సంబంధించిన వివరాలు అడిగారు. చెప్పాను. ఇప్పుడు వివరణ కోరుతూ నోటీస్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ కి సహకరించమని కూడా నోటీస్ లో ఉంది. అంతే. ఇకపైన మిగతా విషయాలు చూడాలి' అని పోస్ట్ చేసారు.. అంతటితో ఆగితే కత్తి మహేష్ ఎలా అవుతా? అనుకున్నారేమో.. ఇంకో పోస్ట్ పెట్టి మరోసారి విమర్శలకు, చర్చలకు తెర లేపారు.

 'శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనువదించిన రామాయణం లో యుద్ధకాండలో రాముడు సీతనుద్దేశించి " సద్వంశంలో పుట్టినవాడు పౌరుశవంతుడయితే, పరగృహంలో ఉండిన భార్యను ఆనందంతో ఎవడు స్వీకరించగలడు. ఇంత కాలానికి నువ్వు రావణుని ఓడిలోనుండి దిగివచ్చావు. వాడు నిన్ను దుశ్చింతతో చూసాడు. ఇక నా కులం పాడుచేసుకుని నిన్నెలా స్వీకరిస్తాను? పోయిన కీర్తి మళ్లీ తెచ్చుకోవడానికి నిన్ను సాధించాను. నాకు నీయెడల ఆసక్తి లేశమూ లేదు.యథేచ్ఛగా వెళ్లిపో. ఇది నేను దృఢ నిశ్చయంతో చెప్పినమాట కానీ వేళాకోళం కాదు. కనుక లక్ష్మణుని దగ్గరకో, భరతుని దగ్గరకో, వానరేంద్రుడైన సుగ్రీవునిదగ్గరకో, రాక్షసేన్ద్రుడయిన విభీషణునిదగ్గరకో వెళ్లి కాలం గడుపుకో. నువ్వు చక్కని దానవు. నాగరికత కలదానవు. వంట ఇల్లు జొచ్చిన కుందేలులాగా తన ఇంటో ఉన్నదానవు. సహజంగా దుష్టుడయిన రావణుడు నిన్ను విడిచిపెట్టి ఉండడు" అని చాలా కఠినంగా చెప్పాడు. లాలనపాలనలు ఎదురుచూస్తూ ఉన్న సీత ఇది విని ఏనుగు చేతచిక్కిన సల్లకీలతలాగా వడవడ వొణికిపోతూ కన్నీరు విడిచింది.

ఆధారం: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సర్వలభ్య రచనల సంకలనం మూడవ సంపుటం. మనసు ఫౌండేషన్ ప్రచురణ. కాబట్టి, సీతను రావణునిదగ్గర కే తిరిగి వెళ్ళిపొమ్మన్నది సాక్షాత్తు సీత భర్తయిన శ్రీరాముడే. ఆ తరువాతే మణిరత్నం అయినా, బాబు గోగినేని అయినా లేదా నేనైనా అన్నది'. అంటూ పోస్ట్ చేసారు.. దీంతో మళ్ళీ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.. ఈ చర్చలు ఎప్పుడు ముగుస్తాయో ఏంటో.