కన్నడ స్పీకర్ ని టార్గెట్ చేసిన బీజేపీ...ముందరి కాళ్ళకి బంధం !

 

కర్ణాటకలో విజయవంతంగా భాజాపా సీఎం ప్రమాణ స్వీకారం చేయడంతో ఇప్పుడు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు ఆ పార్టీ మేధావులు. ఇప్పటికే ముఖ్యమంత్రి కుమారస్వామి కథ ముగియడంతో తమకి భవిష్యత్తులో ఇబ్బందిగా మారే అవకాశం ఉన్న స్పీకర్‌ రమేష్‌కుమార్‌పై దృష్టి సారించారు కమల దండు. ఆయనపై ఆర్టికల్‌ 179 (సీ) ప్రయోగించి ముందరి కాళ్ళకి బంధం వేయాలని ఆ తర్వాత సభలో విశ్వాసం పొందాక ఏకంగా సాగనంపే ఉద్దేశంతో ఉంది.  

దాదాపుగా ఏడాది క్రితం ఒకసారి సీఎంగా ప్రమాణం చేసి అది కుదరక మళ్ళీ తప్పుకుని ఆనాటి అధికారం కోసం ఎదురు చూస్తున్న కాషాయదళం కోరిక నెరవేరింది. కానీ సభలో బలనిరూపణ చేసుకోవాల్సిన పెద్ద గండం ముందుంది. ఇటువంటి సమయంలో స్పీకర్‌ వ్యవహారశైలి చాలా కీలకం. ఇప్పటికే రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. మిగిలిన వారి రాజీనామాలను ఆయన పరిశీలిస్తున్నారు. 

ఇదే జరిగితే బీజేపీ గట్టెక్కడం కష్టమే. జేడీఎస్‌-కాంగ్రెస్‌ అనుకూలవాదిగా ముద్రపడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన స్పీకర్‌ రమేష్‌కుమార్‌ను సాగనంపకుంటే విశ్వాస పరీక్షలో గట్టెక్కడం కష్టమని బీజేపీ భావిస్తోంది. అందుకే కొత్త వ్యూహానికి తెరతీస్తున్నట్లు సమాచారం. నిజానికి రాబోయే సోమవారం యడ్యూరప్ప సీఏమ్గా తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. రెబెల్‌ ఎమ్మెల్యేలంతా బీజేపీకి మద్దతు ఇస్తామని చెబుతున్నారు కానీ అలా అని వారి నుండి ఎటువంటి లిఖిత పూర్వక హామీ లేదు. 

అది స్పీకర్ చేతికి వచ్చిన వెంటనే ఆయన అసమ్మతి ఎమ్మెల్యేలపై వేటు వేసే విశ్వాస పరీక్షలో గట్టెక్కడం యడ్యూరప్పకు కష్టమవుతుంది. అందుకే ఆయనను వీలైనంత త్వరగా సాగనంపే ఏర్పాట్లను చేస్తున్నారని అంటున్నారు. సభలో మెజార్టీ ఉన్న పార్టీకి స్పీకర్‌ను తొలగించే అధికారం ఉన్నప్పటికీ బలనిరూపణ చేసుకోక ముందే ఇది సాధ్యం కాదు. ఈలోగా ఆయనను కంట్రోల్ లో పెట్టాలంటే ఆర్టికల్‌ 179 (సీ) ప్రయోగం ఉత్తమమని కమలనాథులు భావిస్తున్నారు. 

స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్లను తొలగించేందుకు ఉద్దేశించిన ఈ చట్టంతో ఆయన్ని తొలగిస్తూ నోటీసు ఇస్తే, ఇప్పటికిప్పుడు తొలగించలేక పోయినా ఆయన అధికారాలకు మాత్రం బ్రేక్‌ పడుతుంది. 14 రోజుల నోటీసు పీరియడ్‌లో స్పీకర్‌కు కొన్ని అధికారాలు మాత్రమే ఉంటాయి. ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుండదు. ముఖ్యంగా రెబల్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉండదు. కాబట్టి ఈ దిశగా అధికార బీజేపీ పావులు కదుపుతోంది. ఏది ఏమయినా దక్కక దక్కక దక్కిన పదవిని కాపాడుకోవడానికి బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది.