పల్నాడులో ఉద్రిక్తత.. కన్నా అరెస్ట్

 

ఈ రోజు పల్నాడులోని గురజాలలో బహిరంగ సభ కోసం బయలు దేరిన బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా గురజాల, మాచర్లలో బీజేపీ కేడర్ పై దాడులు జరుగుతున్నా ఎపి ప్రభుత్వం పట్టించుకోకపోవడం తో నిరసనగా ఈరోజు గురజాల బహిరంగ సభకు సిద్ధమవుతుండగా సభకు అనుమతి లేదన్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని సత్తెనపల్లి గెస్ట్ హౌస్ కు తరలించారు. గురజాలలో బీజేపీ సభకు అనుమతి ఇవ్వకపోవడంపై కన్నా ఏపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. మూడు నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తే భవిష్యత్తులో ఎలా ఉంటుందో అర్థం అవుతుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కన్నాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుసుకున్న బీజేపీ శ్రేణులు.. పెద్ద ఎత్తున సత్తెనపల్లి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. పల్నాడులో జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మొన్న 11న చలో ఆత్మకూర్ అంటూ టీడీపీ ఇచ్చిన పిలుపుతో టీడీపీ నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేయగా ఈ రోజు బీజేపీ నేత కన్నా ను అరెస్ట్ చేయడం తో అక్కడ నెలకొన్న పరిస్థుతుల తీవ్రత అర్థమౌతోంది.