చంద్రబాబు నాకు సలహాదారు-కేఏ పాల్‌

 

రానున్న ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటించిన కేఏ పాల్‌..తానే కాబోయే ముఖ్యమంత్రి అని జోస్యం చెప్తున్నారు. తాజాగా ప్రజాశాంతి పార్టీ వ్యవహారాల గురించి తెలియజేసేందుకు గుంటూరు, విజయవాడలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ.. ‘‘నేను సీఎం కాగానే చంద్రబాబును సలహాదారుడిగా పెట్టుకుంటాను. 2019లో నేను అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పటికే అనేక సర్వేలు ఈ విషయాన్ని నిర్ధారించాయి. దీనిని గుర్తించిన చంద్రబాబు నన్ను అడ్డుకోడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ, చంద్రబాబు కలిసి నా సంస్థకు నిధులు రాకుండా నిలిపేశారు. వారిద్దరూ శాశ్వత మిత్రులు. వారితో జగన్‌ కూడా కలిశారు. వీళ్ళల్లో ఎవరికి ఓటు వేసినా మోడీకి ఓటు వేసినట్లే. నేనొక్కడినే మోడీకి ప్రత్యామ్నాయం. మోడీ రెండోసారి ప్రధాని కావడం అసంభవం. 18 పార్టీలతో కూడిన థర్డ్‌ ఫ్రంట్‌కు 300కు పైగా సీట్లు వస్తాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి పని చేస్తాను. ఎన్నికల్లో పవన్‌ ప్రభావం ఉండదు. జగన్‌ సీఎం కాలేడు ’’ అని పేర్కొన్నారు.