టీడీపీ శిబిరాల గుట్టురట్టు.. పెయిడ్ ఆర్టిస్టుకు రూ.5,000 ఇచ్చారు!!

 

టీడీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులను నిరసిస్తూ 'ఛలో ఆత్మకూరు' కు చంద్రబాబు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, శిబిరాల్లో ఉన్నవారు కూడా పెయిడ్ ఆర్టిస్టులేనని వైసీపీ ఆరోపిస్తుంది.

ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తాజాగా గుంటూరులో మీడియా మాట్లాడుతూ చంద్రబాబు మీద, టీడీపీ మీద విమర్శలు గుప్పించారు. పల్నాడులో శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేయడానికే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం అనే మాటను నోటి వెంట పలికేందుకు బాబుకు అర్హత లేదని దుయ్యబట్టారు. ప్రశాంతంగా ఉన్న ఆత్మకూరును కలుషితం చేసేందుకు చంద్రబాబు చేపట్టిన కుట్ర ఇది అని మండిపడ్డారు. 

"ఇక్కడ ఏమీ లేదని శిబిరాల్లో ఉన్నవాళ్లే చెప్పారు. ఈ శిబిరాలకు గిరిపురం నుంచి కూడా ఓ పెయిడ్ ఆర్టిస్టు వెళ్లారు. అతనికి టీడీపీ నేతలు రూ.5,000 ఇచ్చారు. అసలు దాడులు జరిగాయన్నది నిజమే కాదు. గాలిని పోగు చేయడం, గాలివార్తలు రాయించడం చంద్రబాబుకు మామూలే" అని జోగి రమేష్ విమర్శించారు. 2014 లో టీడీపీ అధికారంలోకి రాగానే 30 మంది వైసీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వైఎస్ జగన్ 100 రోజుల పాలన కాలంలో ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగలేదని స్పష్టం చేశారు.