త్వరలోనే ప్రకటిస్తా... ఓపిక పట్టండి...

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ బీజేపీలో చేరుతున్నారా..?  లేక జనసేనలో చేరుతున్నారా..? అని ఆయన ఎప్పుడైతే రాజీనామా చేశారో.. అప్పటినుండి వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన... నేను జనసేనలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పేశారు. దీంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలపై కూడా స్పందించిన లక్ష్మీ నారాయణ.... తాను రాజకీయాల్లోకి వస్తున్నానని మీడియా ప్రచారం చేస్తోందని, అయితే తాను భవిష్యత్‌లో ఏం చేయబోతున్నాననే విషయంపై తాను ఎక్కడా చెప్పలేదని...తన రాజీనామా ఆమోదం పొందాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. తన రాజీనామా ఆమోదం పొందడంలో ఆలస్యం జరుగుతోందని, కానీ, ఉద్దేశపూర్వకంగా కాదని, వరుస సెలవుల వల్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తన రాజీనామాపై దృష్టి సారించలేక పోతున్నారని అన్నారు. తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని... ప్రభుత్వ ఉద్యోగిగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఇంకా కొన్ని ఉన్నాయని, రాజీనామా ఆమోదం పొందాక ఎందుకు చేశానన్న విషయం చెబుతానని అన్నారు.