రాజకీయాల నుండి తప్పుకుంటున్నా...

 

తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలో ప్రపంచ నేల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.... రాజకీయాల నుంచి ఈ ఏడాదే వైదొలుగుతానని... 2019 ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. లాభనష్టాలను పట్టించుకోకుండా వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల కోసం రైతులు ఎదురు చూడకుండా కష్టపడి పని చేయాలని ఆయన సూచించారు. కష్టపడే వాడికి ఎక్కడికెళ్లినా కడుపునిండుతుందని చెప్పిన జేసీ, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం కన్నా ఎరువులపై రాయితీ ఇస్తే బాగుంటుందని అన్నారు. వ్యవసాయం చేసేందుకు అధునాతన యంత్రపరికరాలను రైతులకు అందజేయాలని అభిప్రాయపడ్డారు.