కనికరం కూడా లేదా... ఉద్యోగ సంఘాల పై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు

 

తెలంగాణ ఉద్యమంలో పేరొందిన నాయకుల్లో ఈ నలుగురు ముఖ్యులు. జీతం కోసం ఉద్యోగం.. జీవితం కోసం తెలంగాణ.. నినాదంతో కార్మిక వర్గాలను ఏకం చేసే పనిలో సక్సెస్ అయ్యారు నలుగురు. ఉద్యోగ సంఘాల నాయకులైన స్వామిగౌడ్, దేవీ ప్రసాద్, శ్రీనివాసగౌడ్ ,విఠల్ లు ముందుండి సకల జనుల సమ్మెతో యావత్ సమాజాన్ని ఏకం చేశారు. ఆ సమ్మెతోనే ఉద్యమానికి ఊపిరి వచ్చిందని చెప్పుకోవాలి. అప్పట్లో ఆర్టీసీ చక్రాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇలా అన్ని వర్గాలనూ ఉద్యమంలో నడిపించారు ఉద్యోగ సంఘాల నేతలు. అయితే ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె 53 రోజులు జరిగినా ఉద్యమంలో కలిసి పని చేసిన ఉద్యోగ సంఘాలు అంతగా సహకరించిన దాఖలాలు లేవన్నది కాంగ్రెస్ వాదన. అందుకే కాంగ్రెస్ నేతలు ఉద్యోగ సంఘాల నాయకులను టార్గెట్ చేస్తున్నారు. 

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మొదటి నుండి ఉద్యోగ సంఘాలను బయటకు రప్పించేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పుడు జగ్గారెడ్డి ఆర్టీసీ సమ్మె కారణంగా చూపుతూ ఉద్యోగ సంఘాల పై విమర్శల అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఇతర సంఘాల నేతలు ఒకటి రెండు రోజులు మద్దతిచ్చారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అప్పట్లో అన్ని వర్గాల నుండి ఒత్తిడి రావడం తోనే ఆ మాత్రం మద్దతిచ్చారని విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించుకుని ఉద్యోగాల్లో చేరతామన్నా కూడా చేర్చుకునేది లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకుల పై దాడి మొదలుపెట్టింది కాంగ్రెస్. ఉద్యమంలో అందరినీ కలిపి నడిపించిన ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు కార్మికులు అలమటిస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారని జగ్గారెడ్డి మాటలు ఎక్కుపెట్టారు. ఉద్యమంలో వాడుకుని ఇప్పుడు మాత్రం కార్మికులను రోడ్డు మీద పడటం ఏంటన్నది జగ్గారెడ్డి వాదన.

ఆర్టీసీ ఎండీ ప్రకటన తరువాత కూడా ఇతర ఉద్యోగ సంఘాలు కనీసం స్పందించకుండా మౌనంగా ఉండటం ఎంత వరకు సబబని ఫైరవుతున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ కార్మి కుల సమ్మెపై వ్యవహరిస్తున్న తీరుతో భవిష్యత్ లో ఏ ఉద్యోగ సంఘమైనా సమ్మె అంటే ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే మిగిలిన సంఘాల నేతలు ఆర్టీసీ సమ్మె విషయంలో ఓపెన్ అవ్వడానికి వెనుకా ముందాడుతున్నారని అభిప్రాయముంది. అయితే తోటి ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనీసం కలుపుకుని పోయే మార్గం కూడా చూపలేదన్న అపవాదు మాత్రం ఉద్యోగ సంఘాల నాయకులపై పడింది. దాన్ని ఇపుడు కాంగ్రెస్ చర్చకు పెడుతోంది.