జగన్ కలలు!
posted on Nov 29, 2013 12:24PM
పదహారు నెలలపాటు జైల్లో గడిపి వచ్చిన జగన్ అక్కడ పనేమీ లేకపోవడంతో కలలు కనడం బాగా ప్రాక్టీసు చేసినట్టున్నాడు. అందుకే జైల్లోంచి జనాల్లోకి వచ్చాక కూడా కలలు కనడం కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం జగన్ రాబోయే ఎన్నికల తర్వాత తాను ముఖ్యమంత్రి అయిపోతున్నట్టు కల కంటున్నాడు. కల కంటే కన్నాడు.. ఆ కలని కనిపించిన ప్రతి ఒక్కరికీ చెబుతున్నాడు. తనకు వచ్చిన ప్రతి కలనీ బయటకి చెప్పాలనుకునే మానసిక వ్యాధి పేరేంటో మానసిక వైద్య నిపుణులే చెప్పాలి.
ప్రస్తుతం జగన్ వరద బాధితులను పరామర్శించే నెపంతో సీమాంధ్రలో తిరుగుతున్నాడు. తుఫాను బాధితుల పరామర్శ కార్యక్రమంలోనే ఓదార్పు యాత్రని, సమైక్య సందేశాలని మిక్స్ చేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మూడు దెబ్బలకు ఒకే పిట్ట అన్నట్టుగా మూడు కార్యక్రమాలను ఒకేదాంట్లో మిక్స్ చేసి ఓటరు పిట్టని కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. జగన్ వెళ్ళిన ప్రతిచోటా రైతులు తమ కష్టాలన్నీ వెళ్ళబోసుకుంటుంటే, జగన్ మాత్రం ప్రతి చోటా త్వరలో నా ప్రభుత్వం రాబోతోంది. అప్పుడు మీకు న్యాయం జరుగుతుందని చెప్తున్నాడట.
తుఫాను బాధితులకు న్యాయం చేయండంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఒక పద్ధతిగా వుంటుందిగానీ, నా ప్రభుత్వం వచ్చాక మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పడమేంటని జనం విసుక్కుంటున్నారు. జగన్ చేస్తున్న యాత్ర ఎన్నిక ప్రచార యాత్రలా వుందే తప్ప తమను పరామర్శించడానికి వచ్చిన యాత్రలా లేదని జనం అంటున్నారు. పీడకలలాంటి తుఫానును ఎదుర్కొన్న తమ కన్నీళ్ళు తుడవడం మానేసి తాను కంటున్న కల గురించి చెప్పుకోవడమే ఎక్కువైపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి.