6 నెలల తరువాత బయటకి వచ్చిన జగన్
posted on Jun 7, 2013 2:57PM
అక్రమాస్తుల కేసులో అరెస్టైన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి దాదాపు ఆరు నెలలుగా బయట ప్రపంచాన్ని లోపలే ఉండి నడిపిస్తున్న ఆ జగన్నాయకుడు ఈ రోజు జైలు బయట కాలుపెట్టాడు. నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు జగన్ హాజరయ్యారు. అయితే ఇవాళ దాల్మియా సిమెంట్స్ విషయంలో దాఖలైన ఛార్జిషీట్ పై విచారణ కొనసాగుతుంది. జగన్ ను ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కోర్టుకు తరలించారు.
ఇదే కేసులో కోర్టుకు హాజరైన మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కూడా కోర్టుకు వచ్చారు. వాళ్లిద్జరూ కోర్టులో పక్కపక్కనే కూర్చోవడం విశేషం. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. అంతకుముందు జగన్ ను కోర్టు బయట అతని తల్లి విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయమ్మ కంటతడి పెట్టారు. విజయమ్మను జగన్తో పాటు.. వైకాపా ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిలు ఓదార్చారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ న్యాయమూర్తికి జగన్ విజ్ఞప్తి చేశారు. దీనికి కోర్టు అంగీకరించింది. గంటపాటు కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చని పేర్కొంది. కోర్టు ఆవరణలో జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మరోవైపు కోర్టు బయట ఆయన పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో హడావుడి ఏర్పడింది.