ఏపీ సమస్యలను గాలికొదిలేసిన చంద్రబాబు

 

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారంలో పాల్గొన్నది విదితమే. దీనిపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద జగన్‌ మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికలొస్తే సొంత రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినట్లుగా.. ఏపీ సమస్యలను గాలికొదిలేసి చంద్రబాబు ప్రచారం చేశారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఓడించాలని తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏపీలో 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేశారని జగన్‌ ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో శంషాబాద్‌ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌రోడ్డు దివంగత సీఎం వైఎస్‌ హయాంలో పూర్తయితే అది తన ఘనతగా చంద్రబాబు చెప్పుకొంటున్నారని దుయ్యబట్టారు.

అంతేకాకుండా తిత్లీ బాధితులకు సాయం చేసే విషయంలో చంద్రబాబు ప్రచార ఆర్భాటం ఎక్కువగా కనిపిస్తోందని జగన్‌ విమర్శించారు. బాధితులకు న్యాయం చేయకుండా విజయవాడ, విశాఖ నగరాల్లో ప్రచార హోర్డింగులు ఏర్పాటు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. తిత్లీ తుపానుతో రూ.3,435 కోట్ల నష్టం వాటిల్లితే కేవలం 15 శాతం మాత్రమే బాధితులకు చెల్లించారని ఆయన విమర్శించారు.