తెలంగాణలో ఓటుకి పదివేలు.. ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు

 

తెలంగాణలో ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో ప్రజకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్ అనూహ్య ఓటమిని చవి చూసింది. సీఎం అభ్యర్థి స్థాయి నేతలు కూడా దారుణంగా ఓడిపోయారు. అయితే టీఆర్ఎస్ నిజాయితీగా గెలవలేదంటూ కాంగ్రెస్ విమర్శించింది. ఈవీఎంలు ట్యాపరింగ్ చేసారని, అధికారం అడ్డుపెట్టుకొని డబ్బులు విచ్చల విడిగా పంచారని ఆరోపణలు చేసింది. అయితే ఎన్నికల ఫలితాల తరువాత ఓడిపోయిన పార్టీ.. గెలిచిన పార్టీ మీద ఇటువంటి ఆరోపణలు చేయడం కామన్ అని ఎవరూ అంత సీరియస్ గా తీసుకోలేదు. అయితే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 'తమ బంధువు ఇంట్లో మూడు ఓట్లు ఉంటే వాళ్లకు ఓ రాజకీయ పార్టీ నాయకులు రూ. 15 వేల రూపాయలు ఇచ్చారు. అంటే ఒక్కో ఓటుకి ఐదువేల నుంచి పదివేల వరకు ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అద్భుతంగా ఉంటుంది, రాష్ట్రం మారుతుందనుకుంటే.. అంతా వట్టిదే అయింది' అని ఆకునూరి మురళి అన్నారు.

ప్రస్తుతం ఆకునూరి మురళి పురావస్తు శాఖ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఓ సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ లు అంతా సమావేశమై పోస్టుల కేటాయింపులో తమకు జరుగుతున్న అన్యాయం పై చర్చించారు. ప్రభుత్వ తీరును కూడా ప్రశ్నించారు. ఈ సమావేశంలో మురళీనే కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో దళిత, సామాజిక తరగతుల వారికి అన్యాయం జరుగుతుందన్నారు. కేవలం కొంతమందికి మాత్రమే కీలక స్థానాలు ఇచ్చి సెక్రటేరియట్ లో చక్రం తిప్పుతున్నారన్నారు. కొంత మందికి ఏళ్ల తరబడి ప్రాధాన్యత లేని పోస్టులు కేటాయించి అవమాన పరిచారని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఆయన ఏకంగా తెలంగాణ ఎన్నికల్లో డబ్బు విపరీతంగా పంచారని వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా ఇది టీఆర్ఎస్ నేతల పనేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులే ఓటుకు పది వేల రూపాయలు ఇస్తున్నారని తెలంగాణలో ఓట్లను కొనుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఎన్నికల సంఘం మురళీ వ్యాఖ్యల ఆధారంగా తక్షణమే స్పందించి విచారణ చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.