నన్ను క్షమించండి.. నాపై నిషేధం విధించకండి: కోహ్లీ

టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్ మెన్ లో ఒకడు.. అలాంటి కోహ్లీ 'నన్ను క్షమించండి.. నాపై నిషేధం విధించకండి' అని వేడుకున్నాడట.. అయితే అది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు.. 2012 లో జరిగిన సంఘటన.. తాజాగా కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2012లో సిడ్నీ టెస్టు సందర్భంగా చోటుచేసుకున్న వివాదం గురించి వివరించాడు.

 

 

టీమిండియా 2012లో ఆస్ట్రేలియాలో పర్యటించింది.. ఈ పర్యటనలో భాగంగా రెండో టెస్టు సిడ్నీలో జరిగింది.. ఈ మ్యాచ్‌లో స్టేడియంలో స్థానిక ప్రేక్షకుల ప్రవర్తనతో చిరాకుపడ్డ కోహ్లీ ఓ దశలో వారివైపు మధ్య వేలిని చూపించి తన కోపాన్ని ప్రదర్శించాడు.. కోహ్లీ ప్రవర్తను గమనించిన మ్యాచ్‌ రిఫరీ రంజన్‌, కోహ్లీని తర్వాతి రోజు తన రూమ్‌కి రావాల్సిందిగా ఆదేశించాడు.. దీంతో కోహ్లీ అక్కడికి వెళ్లాడు.. ‘నిన్న బౌండరీ లైన్‌ వద్ద ఏం జరిగింది? అని రిఫరీ ప్రశ్నించాడు. దీనికి నేను ఏం జరగలేదు అని చెప్పేసరికి పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్‌ను నా ముందుకు విసిరేశాడు. అందులో నేను మధ్య వేలిని చూపిస్తున్న ఫొటో ఉంది. వెంటనే నన్ను క్షమించండి.. నాపై నిషేధం విధించకండి అంటూ వేడుకున్నా. అతను మంచి వ్యక్తి. యుక్త వయస్సులో ఇవన్నీ సహజం అనుకొని నన్ను అర్థం చేసుకున్నాడు’ అని కోహ్లీ ఆ సంఘటనను గుర్తు చేసుకున్నాడు.. అయితే ఆ తర్వాత కోహ్లీ ఈ ఘటనకు సంబంధించి ఓ ట్వీట్‌ కూడా చేశాడు.. ‘క్రికెటర్లు అలా ప్రవర్తించొద్దన్న నియమాన్ని అంగీకరిస్తాను.. అయితే ఆ గుంపులోంచి మన అమ్మ, సోదరి గురించి చెడుగా మాట్లాడితే ఏం చేయాలి? చాలా ఘోరమైన మాటలు విన్నా’ అంటూ కోహ్లీ ట్వీట్‌ చేసాడు.