అవును అంట్లు తోమా.. మీ పప్పులా కాదు: కేటీఆర్

 

తెలంగాణలో ముందస్తు వేడి మొదలైందే లేదో.. పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ మాటల యుద్ధం మొదలు పెట్టాయి.. ఓ వైపు కేసీఆర్, జానారెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటుంటే మరోవైపు కేటీఆర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.. తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ముందు కేటీఆర్ అమెరికాలో అంట్లు తోముకున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసారు.. అయితే దీనికి బదులుగా కేటీఆర్, ట్విట్టర్ వేదికగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.. 'నేను అమెరికాలో ఉన్నప్పుడు నా పనులు సొంతంగా చేసుకున్నాను.. మీ పప్పులా కాకుండా సొంతంగా సంపాదించుకున్నాను.. అందుకు నేను గర్వపడుతున్నాను.. మీ మాదిరిగా ప్రజల డబ్బును లూటీ చేసి కారులో డబ్బులను తగులబెట్టుకోలేదని' అని కేటీఆర్ ట్వీట్ చేసారు.. 2014 ఎన్నికల సమయంలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి సంబంధించిన కారులో రూ.2 కోట్లు విలువైన డబ్బులు కాలిపోయిన విషయాన్ని కేటీఆర్ ట్వీట్ లో ప్రస్తావిస్తూ ఉత్తమ్ కి చురకులంటించారు.