మోడీయా మజాకా... హ్యూస్టన్ సిటీ దద్దరిల్లింది...

హౌడీ-మోడీ ప్రోగ్రామ్‌తో అమెరికా హ్యూస్టన్ సిటీ దద్దరిల్లింది. 70వేల మందికి పైగా ఎన్నారైలు హాజరైన సభకు మోడీ-ట్రంప్ కలిసి పాల్గొనడంతో... హ్యూస్టన్ ఫుట్ బాల్ స్టేడియం హోరెత్తిపోయింది. మోడీ, భారత్ మాతాకీ జై నినాదాలతో ఎన్‌ఆర్జీ స్టేడియం మార్మోగిపోయింది. రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ మోడీ వేదికపైకి వస్తుండగా ప్రవాస భారతీయులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. మోడీ-ట్రంప్ కలిసి ఒకేసారి వేదికపైకి రావడంతో... ఎన్నారైలంతా హర్షధ్వానాలు చేశారు. మోడీ-ట్రంప్... ఒకరిపై మరొకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. ఇక సభ ముగిశాక... ఇద్దరూ కలిసి స్టేడియం మొత్తం కలియదిరుగుతూ, ప్రవాస భారతీయులకు అభివాదం చేశారు.

ముందుగా మాట్లాడిన మోడీ.... అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. డోనాల్డ్ ట్రంప్... అమెరికా అధ్యక్షుడు కావడం అమెరికన్ల అదృష్టమన్నారు. మరోసారి ట్రంప్ ...అమెరికా ప్రెసిడెంట్‌ కావాలన్న మోడీ... అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ వ్యాఖ్యానించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్‌ తిరిగి నిలబెట్టారని, ట్రంప్.. అమెరికాకే కాదు...ప్రపంచానికే ఎంతో సేవ చేస్తున్నారని మోడీ కొనియాడారు. భారత్‌కు నిజమైన శ్వేతసౌధ స్నేహితుడు ట్రంపే అన్నారు. అనంతరం మాట్లాడిన ట్రంప్‌.... మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక్క భారత్‌కే కాదు... ప్రపంచానికే మోడీ గొప్ప సేవ చేస్తున్నారంటూ కొనియాడారు. భారత్-అమెరికా సంబంధాలు ఎన్నడూ లేనంత బలోపేతమయ్యాయన్న ట్రంప్.... భారత్ అత్యున్నత విలువలు, సంస్కృతి సంప్రదాయాలు.... అమెరికా విలువలతో కలిసిపోయాయన్నారు.

ఇక, మోడీ-ట్రంప్‌కి రాకముందు, డప్పుల మోతతో హ్యూస్టన్ స్టేడియం దద్దరిల్లిపోయింది. ప్రవాస భారతీయులు తమతమ రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఈ హౌడీ-మోడీ ప్రోగ్రామ్‌లో ప్రెసిడెంట్‌ ట్రంపే కాకుండా, అమెరికాలోని 50 రాష్ట్రాలకు చెందిన సెనేటర్లు, గవర్నర్లు, మేయర్లు పాల్గొన్నారు.