గుర్మీత్ పారిపోవడానికి సహకరించిన ఆ ఇద్దరు ఎవరు...?
posted on Sep 15, 2017 4:41PM
ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు సీబీఐ ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆయన జైలుకు వెళ్లిన నాటి నుంచి డేరా కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనేక చీకటి కోణాలను బయటకు తీశారు. తాజాగా ఈ దర్యాప్తులో మరో వాస్తవం వెలుగు చూసింది. తీర్పు వెలువడిన రోజు అంటే ఆగస్టు 25 నాడు డేరా బాబాను తప్పించడానికి అనేక యత్నాలు జరిగాయి..గుర్మీత్ను రోహతక్లోని జైలుకు తరలింస్తుండగా..ఆయన అనుచరులు కొందరు మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. అయితే ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో మరో పథకం వేసింది డేరా టీం..పోలీసుల సహాయం తీసుకుని బాబాను తప్పించాలన్నదే ఆ ప్లాన్..దీనిలో భాగంగా ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ను లోబరుచుకున్నారు..వారు గుర్మీత్ దోషిగా తేలిన వెంటనే..అతడిని అక్కడి నుంచి తప్పించేందుకు అంగీకరించారు. ఒప్పందం ప్రకారం ఆగస్టు 25న డేరా బాబా భద్రతా చర్యలు చేపడుతున్న వీరు తీర్పు వెలువడిన వెంటనే రహీమ్ను ఆయన అనుచరుల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు..అయితే దీనిని పసిగట్టిన ఉన్నతాధికారులు వీరి కుట్రను భగ్నం చేశారు..వారికి సహకరించిన హెడ్ కానిస్టేబుళ్ళు అమిత్, రాజేశ్, కానిస్టేబుల్ రాజేశ్ను అరెస్ట్ చేశారు..చేసిన నేరం అంగీకరించడంతో న్యాయస్థానం వీరికి కస్టడిని విధించింది.