ఏపీ ఎన్నికల అధికారి బదిలీ
posted on Jan 17, 2019 5:14PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా బదిలీ అయ్యారు. ఆంధప్రదేశ్ విభజన తర్వాత ఆర్పీ సిసోడియా రాష్ట్ర తొలి ఎన్నికల ప్రధానాధికారిగా సేవలు కొనసాగించారు. ఆయన స్థానంలో 1993 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన గోపాలకృష్ణను ఏపీ సీఈసీగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఆయనకు ఎలాంటి అదనపు బాధ్యతలు అప్పగించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా సీఈసీ గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ ‘‘అన్ని శాఖలు సహకరిస్తే ఎన్నికల ప్రక్రియ విజయవంతమవుతుందన్నారు. ఎన్నికల నిర్వహణపై అధికారులు, రాజకీయ పార్టీలతో చర్చిస్తామని చెప్పారు. ఎన్నికల గడువు దగ్గర పడుతోందని, అందరి సమన్వయంతో ఎన్నికలను విజయవంతంగా నిర్వహిస్తామని ద్వివేది ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని, ఓటర్లలోనూ చైతన్యం రావాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని" తెలిపారు.