ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న మూడు డీఏలను చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో డీఏల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించింది. జూలై 2018 నాటి మొదటి డీఏను 2021 జనవరి జీతాల్లో చెల్లించాలని ఆదేశించింది. మొదటి డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 1035 కోట్ల రూపాయల భారం పడనుంది. జనవరి 2019 నాటి రెండో డీఏను 2021 జూలై జీతాల్లో చెల్లించాలని ఆదేశించింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ.2,074 కోట్ల భారం పడనుంది. జూలై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లించాలని ఆదేశించింది. మూడో డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ.3,802 కోట్ల రూపాయల భారం పడనుంది. మొదటి డీఏ బకాయిలను జీపీఎస్‌లో మూడు విడతల్లో జమ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో 4.49 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 3.57 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.