మరో ట్విస్ట్.. అవంతి కోసం మంత్రి గంటా సీటు త్యాగం!!

 

అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడడంతో షాక్ లో ఉన్న అధిష్టానం.. అవంతిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్న అవంతి..  భీమిలి టికెట్ తనకు కేటాయించాలని టీడీపీ అధిష్టానాన్ని కోరినట్టు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు ఆయనతో సంప్రదింపులు జరపడం.. భీమిలి టికెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో.. అటువైపు వెళ్లేందుకు అవంతి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే అవంతి పార్టీ మారకుండా ఉండేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన టీడీపీ అధిష్టానం.. ఇందుకోసం స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావును రంగంలోకి దింపినట్టు సమాచారం.

అవంతికి సన్నిహితుడైన గంటా.. ఆయన కోసం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి సీటును వదులుకోవడానికి కూడా సిద్ధమని టీడీపీ అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని గంటా అవంతిని కలిసి చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే వైసీపీలో చేరేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేసుకున్న అవంతి.. గంటా త్యాగంతో మనసు మార్చుకుని టీడీపీలో కొనసాగేందుకు అంగీకరిస్తారేమో చూడాలి.