మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ మరోసారి గల్లా నిప్పులు

 

ప్రత్యేక హోదా, విభజన హామీలపై మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ పార్లమెంట్ లో నిప్పులు చెరిగిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పట్ల చూపుతోన్న పక్షపాత వైఖరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా, జమ్మూకశ్మీర్ విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకపోవడాన్ని గల్లా జయదేవ్ తప్పుబట్టారు. ఇండియన్ పొలిటికల్ మ్యాప్ లో అమరావతి పేరు లేకపోవడం... ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అవమానం మాత్రమే కాదని... అది ప్రధాని మోడీకి కూడా జరిగిన అవమానంగా చెప్పుకొచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని మోడీ స్వయంగా శంకస్థాపన చేసిన విషయాన్ని గల్లా జయదేవ్ గుర్తుచేశారు. ఇప్పటికైనా, పొరపాటును సరిచేసి, అమరావతి పేరు ఉండేలా ఇండియన్ మ్యాప్‌ను మరోసారి విడుదల చేయాలని గల్లా డిమాండ్ చేశారు.