ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కలకలం... ఐదు మృతదేహాలు..


హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఐదు మృతదేహాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఐదు మృతదేహాల్లో రెండు మృతదేహాలు కారులో లభించగా.. మూడు మృత దేహాలు చెట్ల పొదల్లో లభించాయి. కాగా వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం....మృతులను అమీన్‌పూర్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి(28), ఆయన భార్య మాధవి(25), వారి కుమారుడు వర్షిత్‌(3), మాధవి సోదరి లక్ష్మి(40), ఆమె కూతురు సింధూజ(16) మూడు రోజుల క్రితం వీరంతా ఎపీ 28 డీఎం 3775 కారులో బయలుదేరారు. ఆ త‌రువాత అదృశ్యం అయ్యారు. సెల్‌ఫోన్‌లో అందుబాటులో లేకపోవడంతో..వారి ఆచూకీ తెలియ‌క‌పోవ‌డంతో స‌మీప‌ బంధువులు ప‌ఠాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూడు రోజులుగా వీరంతా ఎక్కడికి వెళ్లారు అన్నది మిస్టరీగా మారింది. మృతదేహాల స‌మాచారం అందుకున్న వెంట‌నే సైబరాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌ సందీప్ శాండిల్య సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని పరిశీలించగా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. అమీన్‌పూర్‌ పోలీసుస్టేషన్‌లో రెండు రోజుల క్రితం వీరిపై అదృశ్యం కేసు నమోదైనట్లు చెప్పారు. మృతులందరినీ బంధువులుగా భావిస్తున్నట్లు చెప్పారు.. వీరంతా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు.