నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

 

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్నది విదితమే.ఇప్పటికే ఎన్నికలు మరియు వాటి ఫలితాలను వెల్లడించే తేదీలను ప్రకటించిన ఎన్నికల శాఖ తాజగా అభ్యర్థుల నామిషన్లను స్వీకరించటానికి సిద్ధమైంది.నేటి నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు.ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ మేరకు నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 19వ తేదీ వరకు సాగుతుంది.20న నామినేషన్ల పరిశీలన,22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం. 23వ తేదీ నుంచి డిసెంబర్‌ 5వ తేదీ సాయంత్రం వరకు అభ్యర్థుల ప్రచారానికి గడువు ఉంటుంది.

డిసెంబర్‌ 7న జరగనున్న పోలింగ్‌ కు ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.గత నెల 22, 23, 24 తేదీల్లో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రావత్‌ నేతృత్వంలో ఎన్నికల సంఘం రాష్ట్రంలో మూడురోజుల పాటు పర్యటించింది. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలతో సమావేశమై ఎన్నికల నిర్వహణను సమీక్షించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు పలు శాఖల ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ ఓటర్ల జాబితాలో తప్పులు, సవరణలపై కసరత్తు వేగవంతం చేశారు.ఈసారి వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.