మరో ప్రణయ్ కథ.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని కత్తితో దాడి

 

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్యఘటనను మరువక ముందే హైదరాబాద్‌ నగరంలోని ఎర్రగడ్డలో మరో దారుణం వెలుగు చూసింది.. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి తండ్రి కత్తితో దాడి చేసాడు.. ఎర్రగడ్డకు చెందిన సందీప్‌(24), బోరబడండకు చెందిన మాధవి(22) గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. వీరిద్దరి కులాలు వేరుకావడంతో యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు.. పది రోజుల కిందట అల్వాల్‌లోని ఓ ఆలయంలో వీరు పెళ్లి చేసుకున్నారు.. వీరి పెళ్లి విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు ముందు వ్యతిరేకించినా తర్వాత ఒప్పుకున్నారు.. అప్పటి నుంచి మాధవి తన భర్తతో అత్తగారింట్లోనే ఉంటుంది.. ఈ నేపథ్యంలో మాధవి తండ్రి రెండు రోజులుగా తనను కలుస్తూ ఆమెతో ప్రేమగా ఉన్నట్లు నటించాడు.. బుధవారం సందీప్‌, మాధవిలకు బట్టలు కొనిస్తానని చెప్పి ఎర్రగడ్డలోని హోండా షోరూం దగ్గరకు రమ్మని పిలిచాడు.. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం అందరూ చూస్తుండగానే వారిపై దాడికి పాల్పడ్డాడు.. ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న నీలిమ ఆస్పత్ర్రికి తరలించారు.. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం మాధవి పరిస్థతి విషమంగా ఉన్నట్లు యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు.