కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్
posted on Nov 23, 2020 7:34PM
అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ తిరిగి సొంతగూటికి చేరారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ కి దూరమైన ఆయన.. ఇవాళ ఉమెన్చాందీ, శైలజానాథ్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ మోసం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీపై పోరాడటంలో వైసీపీ, టీడీపీలు విఫలమయ్యాయని విమర్శించారు. ఏపీ ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని, ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని హర్షకుమార్ చెప్పారు.
కాగా, 2004-2014 వరకు వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా గెలుపొందిన ఆయన, రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడతున్నారు.