నిమ్మగడ్డ తీర్పు పై సుప్రీం కోర్టుకు.. కానీ రివర్స్
posted on May 30, 2020 2:50PM
ఏపీ ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు చెల్లదని రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పిన విషయం తెల్సిందే. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు నిన్న స్పష్టం చేశారు. అయితే దీనిపై ఎపి కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ ప్రభుత్వం కంటే ముందుగానే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా ఆయన తరపున లాయర్ నర్రా శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో ఈ రోజు కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో అప్పీల్ కు వెళ్తే.. తమను సంప్రదించకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వరాదని ఆ పిటిషన్ లో సుప్రీం కోర్టును కోరినట్లు తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విషయం లో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఈ సందర్బంగా ఆయన వ్యాఖ్యానించారు. మరి జగన్ ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి.