ఈఎస్ఐ కేసులో మంత్రి పీఏ అరెస్ట్

తెలంగాణలో సంచలనం స్పష్టించిన ఈఎస్ఐ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మళ్లీ దూకుడు పెంచారు. హైదరాబాద్ లో సోదాలు నిర్వహించారు. ఏడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిగాయి. డీడీ కాలనీలో నివాసం ఉంటున్న  నాయిని నరసింహారెడ్డి దగ్గర గతంలో పీఏగా పని చేసిన ముకుందరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. పలు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ముకుంద రెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ రైడ్స్‌ను మొత్తం అధికారులు వీడియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దగ్గర పీఏగా ముకుందరెడ్డి పని చేస్తున్నారు.

మాజీ హోంశాఖ మంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి నివాసంలో తనిఖీలు చేసిన ఈడీ అధికారులు భారీగా నగదు, నగలు గుర్తించారు. నకిలీ నోట్ల కట్టలతో పాటు రూ.కోటికి పైగా విలువైన నగలు, బ్లాంకు చెక్కులు, ఆస్తుల దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో భారీగా నగదు, నగలను గుర్తించారు. నాయిని మాజీ పీఎస్ ముకుంద రెడ్డి బంధువు వినయ్ రెడ్డి ఇంట్లోనూ భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. ఏడు డొల్ల కంపెనీల నిర్వాహకుడు బుర్ర ప్రమోద్ రెడ్డి ఇంట్లో‌నూ నగలు నగదు స్వాధీనం చేసుకున్నారు. డొల్ల కంపెనీల వెనుక కొందరు రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్టు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. 

ఈఎస్ఐ కుంభకోణంలో గతంలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లో ఏకకాలంలో 10 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించి.. ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. నాయిని కుమారుడు దేవేందర్‌రెడ్డి, అల్లుడు శ్రీనివాస్‌రెడ్డిని ఈడీ విచారించింది. నాయిని నర్సింహారెడ్డి మాజీ పీఎస్ ముకుంద రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అలాగే మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఇతర నిందితుల ఇళ్ళల్లోనూ ఈడీ సోదాలు చేపట్టింది. ఈఎస్‌ఐ స్కామ్‌లో మనీ లాండరింగ్ పాల్పడినట్లు ఈడీ కేసు నమోదు చేసింది. దేవికారాణి మనీ ల్యాండరింగ్ పాల్పడినట్లు ఆధారాలు ఉండగా, ఇప్పటికే 25 మంది అరెస్ట్ చేసింది.