దుర్గాబాయి దేశ్‌ముఖ్.. నెహ్రూని అడ్డుకున్నారు, గాంధీకి గాజులిచ్చారు!

 

మహిళలు తలుచుకుంటే కుటుంబాన్నే కాదు, సమాజాన్ని కూడా చక్కదిద్దగలరని.. మహిళలు ఎందులోనూ తక్కువకాదని.. సహనంలోనైనా, సాహసించి పోరాడటంలోనైనా వారి తరువాతే ఎవరైనా అని ఎందరో మహిళలు రుజువు చేసారు. అలాంటి వారిలో 'దుర్గాబాయి దేశ్‌ముఖ్' ముందు వరుసలో ఉంటారు. ఈరోజు ఆమె జయంతి సందర్భంగా.. ఆమె సాహసాలను, ఆమె సేవలను గుర్తు చేసుకొని స్ఫూర్తి పొందుదాం.

దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో.. 1909 జూలై 15 న మధ్య తరగతి కుటుంబంలో రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. 8 ఏళ్ళ వయసులోనే ఆమెకు మేనమామ సుబ్బారావుతో వివాహమయింది. అయితే తరువాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకించారు. ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు కూడా అంగీకరించారు. 

బాల్యం నుండి ప్రతిభాపాటవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించారు. దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాలుపంచుకున్నారు. ఓ వైపు చదువుకుంటేనే మరోవైపు స్వాతంత్ర్య పోరాటంలో తనవంతు పాత్ర పోషించారు. తన 12 ఏళ్ళ వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించి.. రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను నెలకొల్పారు.

తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఆమె విరాళాలను సేకరించి ఆయనకు అందచేశారు. తన చేతులకు ఉన్న బంగారు గాజులను సైతం విరాళంగా అందించారు. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణంగా ఆయనను అనుమతించలేదు. తన కర్తవ్య నిర్వహణకు గాను నెహ్రూ నుండి ఆమె ప్రశంసలు పొందారు. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కూడా అయ్యారు. స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి.. బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసారు. న్యాయశాస్త్రం చదివిన తరువాత మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించారు. తరువాత ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరు సంపాదించారు.

స్వాతంత్ర్య పోరాటంలోనే కాదు సేవా కార్యక్రమాల్లోనూ ఆమె ముందుండేవారు. దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేశారు. ఆమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది. 1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బ్రుందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించారు. 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నిర్వర్తించారు.

స్వాతంత్ర్యం తర్వాత.. భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పనిచేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేసారు. ఆ సందర్భములో సి.డి.దేశ్‌ముఖ్తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది. వీరి వివాహము 1953 జనవరి 22న జరిగింది. ఈవిడ 1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా, ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పనిచేసారు.

1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు మరియు వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పారు. 

ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఆమె 1975 లో పద్మ విభూషణ్ పొందారు. దుర్గాబాయి..1981 మే 9వ తేదీన హైదరాబాదులో పరమపదించారు. అయితేనేం మరణంలేని ఓ వ్యవస్థగా ఆమె ఎప్పుడూ మనమధ్యనే చిరస్థాయిగా నిలిచి ఉంటారు.

కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు 1998లో ఈవిడ పేరున డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డును నెలకొల్పారు. ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడింది. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను నెలకొల్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ 2006లో డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌గా నామాంతరం చెందింది.