ఆడియో కలకలం.. త్వరలోనే మాజీ పీఎం చనిపోతారు!!

 

'ఏ ఛానల్ చూసినా ఏమున్నది గర్వకారణం.. అంతా ఆడియో టేపుల కలకలం' అన్నట్టుంది ప్రస్తుతం కర్ణాటకలో పరిస్థితి. కర్ణాటకలో కొద్దిరోజుల నుంచి ఆడియో టేపుల కలకలం కొనసాగుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప బేరసారాలు జరిపినట్టుగా చెబుతున్న ఆడియోలను సీఎం కుమారస్వామి విడుదల చేయడంతో ఈ దుమారం మొదలైంది. అయితే ఇప్పుడు మరో ఆడియో టేపు బయటికి వచ్చి రచ్చ చేస్తోంది. ఓ బీజేపీ ఎమ్మెల్యే జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో మాట్లాడినట్టుగా చెబుతున్న ఓ ఆడియో టేపు.. జేడీఎస్ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. హసన్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడదిగా చెప్తున్న తాజా ఆడియో టేపులోని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. త్వరలోనే మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవేగౌడ చనిపోతారని.. ఆయన కుమారుడు కుమారస్వామి ఆరోగ్యం కూడా పెద్దగా బాగోలేదని ఆ ఆడియో టేపులో రికార్డ్ అయ్యింది. అంతేకాదు త్వరలోనే జేడీఎస్ ఓ చరిత్రగా మిగిలిపోతుందని ఆడియో టేపులో ఉంది. దీన్ని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేయడంతో.. జేడీఎస్ కార్యకర్తలు రగిలిపోయారు. హసన్ జిల్లాలోని ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే తనను చంపేందుకు జేడీఎస్ ప్రయత్నిస్తోందని ప్రీతమ్ గౌడ ఆరోపించారు. అయితే ప్రీతమ్ గౌడ ఇంటిపై దాడిని ఖండించిన  కుమారస్వామి.. జేడీఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. ఇంకా ముందు ముందు ఎన్ని ఆడియో టేపులు వస్తాయో ఏంటో.