పలాస ఘటన‌పై సీఎం సీరియస్.. ఇద్దరు అధికారులపై‌ వేటు

శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా కారణంగా మరణించిన వ్యక్తి అంత్యక్రియలు విషయంలో అధికారులు  అమానవీయంగా వ్యవహరించారు. మృతదేహాన్ని జేసీబీ‌ ద్వారా తరలించారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. కరోనా రోగుల మృతదేహాలను ప్లాస్టిక్ కవర్లలో చుట్టి జేసీబీ లు మరియు ట్రాక్టర్లలో తరలించడాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. చనిపోయిన వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉందన్నారు. అమానవీయమైన ఇలాంటి ఘటనకు కారణమైన జగన్ సర్కారును చూసి సిగ్గుపడుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. 

కాగా, ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల దృష్టికి రావడంతో.. వెంటనే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌తో సీఎంఓ అధికారులు మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి సమయాల్లో ఎలా వ్యవహరించాలన్నదానిపై స్పష్టమైన ప్రోటోకాల్‌ ఉన్నప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించి పొక్లెయిన్‌ ద్వారా మృతదేహాన్ని తరలించడం అమానవీయమని స్పష్టంచేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు విచారణ జరిపిన జిల్లా కలెక్టర్‌ నివాస్, పలాస మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాజీవ్‌ను సస్పెండ్ ‌చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే స‌మ‌యంలో.. సోంపేట పరిధిలోని కోర్టు వీధిలో ట్రాక్టర్ పై మహిళ మృతదేహం తీసుకెళ్లిన ఘటనపై కూడా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.

ఈ ఘటనపై సీఎం జగన్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. శ్రీకాకుళం జిల్లా, పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధించిందన్నారు. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృత్తం కాకూడదు. బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోకతప్పదు అని సీఎం హెచ్చరించారు.