ఎయిమ్స్ డైరెక్టర్ కు వ్యాక్సిన్.. తెలుగు రాష్ట్రాల్లో తొలి వ్యాక్సిన్ ఎవరికంటే?
posted on Jan 16, 2021 11:17AM
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. వర్చువల్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3 వేల కేంద్రాలలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా మనీష్ కుమార్ అనే పారిశుద్ధ్యకార్మికునికి టీకా వేశారు. తరువాత ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా టీకా వేయించుకున్నారు. టీకా వేయించుకోవడం ద్వారా ఆయన టీకాపై ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగించారు.
ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ జీజీహెచ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి టీకాను హెల్త్ వర్కర్ పుష్పకుమారికి వైద్యులు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో 3.87 లక్షల మందికి తొలిదశలో వ్యాక్సిన్ వేయనున్నారు.
తెలంగాణలో 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. మొదటి వ్యాక్సిన్ ను పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మకు వైద్యులు ఇచ్చారు.