వాళ్ళకేమో నోటీసులు..నాపై మాత్రం వేటా?

 

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌పై వేటు పడింది. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పిస్తూ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఇబ్రహీంపట్నం స్థానం నుంచి బరిలో దిగాలని ఆ పార్టీ నేత క్యామ మల్లేష్ భావించారు. కానీ పొత్తులో భాగంగా పార్టీ ఆ స్థానాన్ని టీడీపీ కి కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన క్యామ మల్లేష్ స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌పై అవినీతి ఆరోపణలు చేశారు.టికెట్‌ ఇప్పిస్తామని ఆశావహుల దగ్గర రూ.3 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. అంతేగాకుండా టికెట్ల కేటాయింపులో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓటమే ధ్యేయంగా యాదవ, కురమ సామాజికవర్గాన్ని ఏకం చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పీసీసీ.. మల్లేష్‌పై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులోభాగంగా ఆయనను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

క్యామ మల్లేష్ చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం షోకాజ్‌ నోటీసులు జారీ చేయగా ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా వేటుపై స్పందించిన క్యామ మల్లేష్... కుంతియా, ఉత్తమ్‌ను అడ్డగోలుగా దూషించిన కోమటిరెడ్డి బ్రదర్స్‌కు షోకాజ్‌తో సరిపెట్టారని, టికెట్‌ దక్కలేదని జెండా దిమ్మె, సోనియా, రాహుల్‌ ఫ్లెక్సీలను చించేసిన కార్తీక్‌రెడ్డిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, బీసీని కాబట్టే తనను బలిపశువు చేస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్లు అధ్యక్ష పదవికీ, 35 ఏళ్లు పార్టీకి సేవకు చేసినందుకు నాకు ఇచ్చే బహుమానం ఇదా అని క్యామ మల్లేశ్‌ ప్రశ్నించారు. పార్టీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదని, క్రమశిక్షణా ఉల్లంఘించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.