కాంగ్రెస్ మేనిఫెస్టో.. అంతకు మించి.. వరద బాధితులకు రూ.50 వేలు

జీహెచ్ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు మాణికం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి‌, భట్టి విక్రమార్క మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో అధికార పార్టీ టీఆర్ఎస్ ని మించి ఉచిత హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. వరద బాధితులకు రూ.50 వేలు ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చింది. ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.2.5 లక్షల నుంచి 5 లక్షల సాయం అందజేస్తామని వెల్లడించింది. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.2.5 లక్షలు, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5 లక్షలు ఇస్తామని తెలిపింది. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించింది.

 

ఎంఎంటీఎస్‌, మెట్రోల్లో దివ్యాంగులు, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని వెల్లడించింది. అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని తెలిపింది. 80 గజాలలోపు స్థలంలో ఇల్లు కట్టుకున్నవారికి ఆస్తి పన్ను రద్దు అని ప్రకటించింది. క్షురకులు, రజకులు, వడ్రంగులకు చెందిన దుకాణాలకు ఆస్తిపన్నుతో పాటు విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తామని తెలిపింది. ధరణి పోర్టల్ రద్దుకు కృషి చేస్తామని తెలిపింది. ప్రతి కుటుంబానికి 30 వేల లీటర్ల ఉచిత మంచినీరు అందజేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది.