జనసేనకు అంత సీన్ లేదు.. పృధ్వీ సంచలన వ్యాఖ్యలు

 

కమెడియన్ పృధ్వీ వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సందర్భాల్లో వైసీపీకి మద్దతుగా మాట్లాడుతూ టీడీపీ మీద విమర్శలు చేసిన పృధ్వీ.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో పెద్దగా రాణించలేదని అన్నారు. తను వైసీపీలో ఉండడం వల్ల ఈ మాట చెప్పడం లేదని, ఎన్నో ప్రాంతాలు తిరిగి జనాలను పరిశీలించిన తర్వాతే ఈ అభిప్రాయానికి వచ్చానని తెలిపారు. పవన్ కల్యాణ్ ఏ అన్నం తింటున్నాడో తను చెప్పలేకపోవచ్చని, కానీ జనసేన హవా ఎలా ఉందో మాత్రం లెక్కకట్టగలనని అన్నారు. 'ఆయన వాదనలు ఆయనకున్నాయి. అవన్నీ ప్రజలకు నచ్చుతాయని నేను అనుకోవడం లేదు. నేను కూడా స్టేజ్ ఎక్కి వంద మాట్లాడతాను. పవన్ కూడా అంతే. అవన్నీ వినే ఓపిక, పట్టించుకోవాల్సిన అవసరం జనాలకు లేదు. ఆయనకు ఓ పార్టీ ఉంది, ఎజెండా, మేనిఫెస్టో కూడా ఉంది. చూద్దాం, ఆయన హవా ఎలా ఉంటుందో జనాలు తేలుస్తారు' అన్నారు.

జనసేన వల్ల తమ ఓటు బ్యాంక్ కు ఎలాంటి నష్టం లేదన్నారు. 'ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా జనసేనకు పడదు. ఎందుకంటే, ప్రభుత్వాన్ని వ్యతిరేస్తున్న ప్రజలు వైసీపీని ఆరాధిస్తున్నారు. జగన్ వెంట నడుస్తున్నారు. పవన్ ను కేవలం చూడ్డానికి మాత్రమే ప్రజలు వస్తున్నారు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు వర్గం ఓటు బ్యాంకు విషయంపై కూడా పృధ్వీ స్పందించారు. 'కాపు వర్గం ఓట్లు ఎటు వెళ్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే వాదన సరైంది కాదు. కులం మీద ఓటు వేసి గెలిచే సంస్కృతి లేదు. ఓ కాపు వర్గానికి చెందిన వ్యక్తిగా నేను చెబుతున్నాను. కుల రాజకీయాల మీద ఎన్నికలు గెలుస్తామని భావించడం మూర్ఖత్వం ' అని పృధ్వీ పరోక్షంగా కాపులంతా పవన్ వైపే ఉన్నారనే వాదనను తిప్పికొట్టారు. మరి రాబోయే ఎన్నికల్లో జనసేన రాణిస్తుందో లేక పృధ్వీ చెప్పినట్టు డీలా పడుతుందో చూద్దాం.