తనకు మీడియాబలం లేదని చెప్పుకొచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి...!

ముఖ్యమంత్రిగా తొలిసారి పరిమిత మీడియాతో జగన్ మాటా మంతి..
సీఎం స్థానం అంటే.. ఈరాష్ట్రానికి తండ్రిలాంటి స్థానం: జగన్ మోహన్ రెడ్డి
రాష్ట్రంలో ఎక్కడనుంచి పనిచేయాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం.                                         
ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే పాలనా యంత్రాంగం అక్కడ ఉంటుంది: సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి
మనముందున్న లక్ష్యం విశాఖను  టైర్‌–1 స్థాయికి అభివృద్దిచేయడమే: జగన్ మోహన్ రెడ్డి

.మొత్తానికి సి ఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పరిమిత మీడియా తో అయినా, అపరిమితమైన అంశాలను షేర్ చేసుకున్నారు. పెన్షన్ల దగ్గర నుంచి పోలవరం దాకా, ఇంగ్లిష్ మీడియం నుంచి రాజధాని నిర్మాణం దాకా....అనేకానేక విషయాలను స్పృశించిన జగన్ మోహన్ రెడ్డి , తన మనసులో మాటలను, ఆలోచనలను ప్రజలతో పంచుకున్నారు. పెన్షన్లగురించి మాట్లాడుతూ..

ఒకరికి  ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే ... అన్యాయం జరిగిందనే భావన వారికి ఉంటుందాని చెప్పుకొచ్చారు. ప్రజల ముందే లబ్ధిదారుల జాబితా పెడుతున్నామనీ, సామాజిక తనిఖీకోసం గ్రామ ప్రజలముందే, గ్రామ సచివాలయంలో పెడుతున్నామనీ, ఎవరుకూడా తప్పులు చేసే అవకాశం లేకుండా చేస్తున్నామనీ చెప్పుకొచ్చారు సి.ఎం. ప్రతి పథకంకూడా సంతృప్తస్థాయిలో, పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చిన సి.ఎం, పెన్షన్‌ ఇంతకుముందు కావాలంటే మూడు నెలల పెన్షన్‌ డబ్బు లంచంగా ఇవ్వాల్సి వచ్చేదన్న విషయాన్ని గుర్తు చేశారు. పధకాల గురించి మాట్లాడుతూ, మేం ఏంచెప్పామో అదే చేస్తున్నామన్నారాయన. మేం ప్రతి పథకాన్నీ పెడుతున్నామంటే.. మేం చెప్తున్నదాన్ని అమలుచేస్తున్నామని కదా? ప్రతి ఏటా రెవిన్యూ ఎంతోకొంత పెరుగుతుంది. నంబర్లలో కాస్త అటూ ఇటూ ఉండొచ్చుకాని, పెరుగుదలైతే ఉంటుందని కూడాభరోసాఇచ్చారు...

ఇంగ్లిషు మీడియంపైన మాట్లాడుతూ, "న్యూట్రల్‌ మనిషిని ఎవరైనా అడగండి...కచ్చితంగా మా విధానాలను బలపరుస్తారు, మద్దతిస్తారు. ఇవాళ ఇంగ్లిషు మీడియం పెడితేనే... 20ఏళ్లలో మార్పులు వస్తాయి.ఇవాళ ఫస్ట్‌క్లాస్‌ చదవే వ్యక్తి.. 20 ఏళ్ల తర్వాత డిగ్రీ పూర్తిచేస్తారు. ఇవాళ ఫోన్‌ఆన్‌  చేస్తే..కమ్యూనికేషన్‌ అంతా ఇంగ్లిషే. కంప్యూటర్లు.. ఇంటర్నెట్‌అంతా ఇంగ్లిష్‌లోనే. డ్రైవర్‌లెస్‌కార్లు వస్తున్నాయన్నది రియాల్టీ. ఇవాళ మనం మార్పు చేసుకుంటేనే.. భవిష్యత్‌తరాలకు మంచి జరుగుతుంది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి," అని హితవు కూడా చెప్పారు.  అన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యాకమిటీలు పూర్తిగా ఇంగ్లిషు మీడియం పెట్టాలని వారంతా తీర్మానాలు చేసి పంపారని, ఎవర్ని అడిగినా ఇంగ్లిషుమీడియం కావాలనే చెప్తారని కూడా సి.ఎం. చెప్పుకొచ్చారు.

రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై  మాట్లాడుతూ... "రాజధానిపై నేను చెప్పాల్సింది అంతా అసెంబ్లీలోనే చెప్పాను. రాజధానిని ఎంచుకున్న ప్రాంతాన్ని చూడండి. అటు విజయవాడా కాదు, ఇటు గుంటూరూ కాదు...
రాజధాని ప్రాంతం ఎక్కడ వస్తుందీ ముందే తనవారికి, తన అనుచరులకీ చెప్పి.. వేలాది ఎకరాలు కొనుగోలుచేయడం, క్యాబినెట్‌ సబ్‌కమిటీ ప్రాథమిక పరిశీలనలోనే 4వేలకుపైగా ఎకరాలు బటయపడ్డం.. అదంతా వేరే కథ.మరికొన్ని కీలక అంశాలను చూస్తే.. రాజధాని ప్రాంతానికి వెళ్లాలంటే ఇవ్వాళ్టికీ మనం సింగిల్‌ రోడ్డుమీదే వెళ్లాలి. కరకట్టమీదున్న సింగిల్‌ రోడ్డుమీదనుంచే పోవాలి.

నేనేమీ అబద్ధాలు చెప్పడంలేదు. మీడియా ప్రతినిధులుగా మీరుకూడా అదే దారివెంబడి వెళ్లాలి. సమీకరించిన భూమిని డెవలప్‌ చేయడానికి, కరెంటు, రోడ్లు, పైపులైన్‌తో నీరు ఇవ్వడానికి ఎకరాకు కనీసం రూ.2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని గత ప్రభుత్వం వాళ్లే చెప్పారు. రూ. 1,09,000 కోట్ల అంచనా వేశారు. కాని అదే ప్రభుత్వం ఐదేళ్లకాలంలో రూ.5600 కోట్లకు మించి ఖర్చు చేయలేదు. మరో రూ.2–3 వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించమని మాకు అప్పగించి వెళ్లిపోయారు. ఇందులోనూ రూ.500 కోట్ల రూపాయలు వడ్డీలుగా చెల్లించాల్సిన పరిస్థితి," అని గణాంకాలతో సహా వివరించారు జగన్ మోహన్ రెడ్డి. .

ప్రతి ఏటా రూ.6 నుంచి 7 వేల కోట్లరూపాయలు రాజధాని మీద పెడితే.. అది సముద్రంలో వేసిన నీటిబొట్టే అవుతుంది. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు ఉండదు. ఇక్కడి రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కోసం వేసిన అంచనాలో 10శాతం డబ్బును విశాఖపట్నంలో పెడితే కచ్చితంగా మార్పు వస్తుంది. ఇవాళ కాకపోయినా 10 ఏళ్లకైనా మనం హైదరాబాద్‌తోగాని, చెన్నైతోగాని, బెంగుళూరుతోగాని పోటీపడే పరిస్థితి వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉంటుంది. అయినా సరే.. ఇక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకుని లెజిస్లేచర్‌ క్యాపిటల్‌గా కొనసాగిస్తామని చెప్పాం. మహారాష్ట్రలోని నాగపూర్, కర్ణాటకలోని బెల్గాంల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడనుంచి పనిచేయాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం.ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే పాలనా యంత్రాంగం అక్కడ ఉంటుంది.

సీఎం అక్కడనుంచి పనిచేయాలి? ఇక్కడ నుంచి పనిచేయాలి? అని ఎవ్వరూ చుప్పలేరు. మంత్రివర్గానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు, మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ నిర్ణయాలను పాలనాయంత్రాంగం అమలు చేస్తుంది. విశాఖలో నీటికి కొరత ఉందనేది వాస్తవం కాదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరీ.. పోలవరం నుంచి మరింత నీటిని అందించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు.

తుపాన్ల సమస్య రాష్ట్రంలోని 9 కోస్తా జిల్లాలకూ ఉందని చెప్పిన సి.ఎం., ఇదే కృష్ణాజిల్లాలోని దివిసీమలో ఉప్పెన వచ్చిన ఘటనలూ ఉన్నాయన్నారు. విజయవాడకు కేవలం 60 కి.మీ దూరంలో సముద్రం కూడా ఉంది. అలాగే కరవు పీడిత ప్రాంతాలూ ఉన్నాయి. వీటన్నింటికీ మించి మనం చూడాల్సిన అంశం మరొకటి ఉంది. విశాఖపట్నం అనేది రాష్ట్రంలో నంబర్‌ ఒన్‌ సిటీ. దేశవ్యాప్తంగా టైర్‌ –2 సిటీల్లో అగ్ర స్థానంలో ఉంది. ఇప్పుడు మనముందున్న లక్ష్యం దీన్ని టైర్‌–1 స్థాయికి అభివృద్దిచేయడమే. సీఎం స్థానం అంటే.. ఈరాష్ట్రానికి తండ్రిలాంటి స్థానం. దేవుడు మనకు ఈస్థానం ఇచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోతే అదికూడా తప్పే అవుతుంది. దానికి ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.మనం విశాఖపట్నం వెళ్లకూడదు, ఇక్కడా అభివృద్ధికాదు. దీనివల్ల నష్టం మన పిల్లలకే.

రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణకు బిల్లులు పెట్టాల్సిన అవసరంలేదు. సీఆర్డీఏను ఏఎంఆర్‌డీఏగా మార్పుడానికే బిల్లు పెడితే సరిపోతుంది. కాని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ ఒక సంకేతం ఇవ్వడానికే ఈ బిల్లులు పెట్టం.ఇక్కడ వారికీ న్యాయం చేస్తున్నాం, దీంతోపాటు మిగిలిన ప్రాంతాలకూ న్యాయం చేస్తున్నామని, అందరికీ మంచి చేస్తున్నామని చెప్పడానికే బిల్లులు పెట్టాం. ఒక్క ఏఎంఆర్‌డీఏ చట్టంకోసమే బిల్లు పెడితే ప్రస్తతు రాజధాని ప్రాంతం వారికి తప్పుడు సంకేతం పోతుందని చెప్పాం.
ఈ బిల్లులను ఎవ్వరూ ఆపలేరు. 3 నెలలు ఆలస్యం చేయగలరు తప్ప.. ఎవ్వరూ అడ్డుకోలేరు. స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టే బిల్లునుకూడా ఇలాగే మండలిలో అడ్డుకున్నారు. ఆగిపోయిందా? అలాగే ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు బిల్లును కూడా అడ్డుకున్నారు.. ఆగిపోయిందా?, అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కాని, ప్రజలకు మంచిచేసే బిల్లులను ఆమాత్రం ఆలస్యం కూడా ఎందుకు చేయాలి? ప్రజలకు మంచి చేయాలని లేనప్పుడు మండలి ఎందుకు?ప్రజలకు మంచి చేసే బిల్లులను ఆలస్యం చేయాలన్నదేవారి ఉద్దేశం అయినప్పుడు, నిబంధనలను కూడా ఉల్లంఘించి వాళ్లు బిల్లులను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నప్పుడు మండలి అవసరం ఎందుకు? కేవలం మండలిలో ఒక పార్టీకి మెజార్టీ సభ్యులు ఉన్నారని రాజకీయపరమైన ఆలోచనలు చేశారు.  అసలు మండలిని అసెంబ్లీ సృష్టిస్తుంది, అసెంబ్లీకి సహాయపడుతుంది. మండలి అనేది అసెంబ్లీకి సలహా ఇచ్చే ఒక సభ. ఈ పనిని విడిచిపెట్టి రాజకీయంగా ఆలోచించి ప్రజలు ఇచ్చిన తీర్పును పరిహాసం చేస్తామంటే.. ఎలా?

ఒక్క మండలి నిర్వహణ కోసం ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చుచేస్తున్నాం. ఏడాదిపోతే..., శాసనమండలిలో మాక్కూడా మెజార్టీ వస్తుంది. కాని, ఈ ఏడాది సమయాన్నికూడా ఎందుకు వదులుకోవాలి? ప్రజలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రభుత్వ నిర్ణయాల వల్ల వచ్చే మంచిచేరాలి. ఇంగ్లిషు మీడియం బిల్లును ఆమోదిస్తే ఎవరికి లాభం?ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఉంటే ఎవ్వరికి లాభం? రాజధానికార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల ఎవ్వరికి లాభం? విశాఖను అభివృద్ధి చేస్తే ఎవ్వరికి లాభం? ఇవన్నీ కూడా మన పిల్లలకి లాభం కదా? మన ప్రజలకు లాభం కాదా? అన్నది ఆలోచించాలి. అమరావతి రైతుల నుద్దేశించి ప్రశ్నలపై మాట్లాడుతూ, అమరావతి రైతులకు ఏం చేయదలుచుకున్నామో అసెంబ్లీలోనే చెప్పాం. ఎవ్వరికీ అన్యాయం చేయం. రైతులికిచ్చే యాన్యునిటీని పదేళ్ల నుంచి పదిహేనేళ్లకు పెంచాం. అలాగే భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇచ్చే జీవనభృతిని రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచాం. అసైన్డ్‌దారులకు పట్టాదారులతో సమానంగా ప్లాట్ల కేటాయింపులు చేస్తాం. మేం గత ప్రభుత్వం మాదిరిగా బాహుబలి సినిమా గ్రాఫిక్స్‌ చూపించడంలేదు.  వాస్తవాలను ముందు పెడుతున్నాం. అమరావతి లెజిస్లేచర్‌ కేపిటల్‌గా కొనసాగుతుందని చెప్పామన్నారు ముఖ్యమంత్ర


బీజేపీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ, 2019లో బీజేపీ మేనిఫెస్టో ఏంచెప్పిందో ఒక్కసారి చూడండి.రాజధాని భూముల్లో అవినీతి జరిగింది... వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. కాని రాష్ట్రంలోని బీజేపీ నాయకులు దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు. అదే పార్టీకి చెందిన జాతీయ స్థాయి ప్రతినిధులు ఉన్న విషయాలు చెప్తున్నారన్నారు సి.ఎం. ప్రత్యేక హాదా గురించి మాట్లాడిన సి.ఎం., ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం కాదన్నారు.  ముగిసిపోయిన అధ్యాయం అనే పదం వాడ్డం సరికాదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న మా ప్రయత్నాలు ఎప్పటికీ కొనసాగుతాయి. ప్రతిసారి మేం కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాం. ప్రధానమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాం. ఎప్పుడో ఒకసారి మా అవసరం వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం.  కేంద్రానికి అవసరమైన రోజున మన ఎంపీల పాత్ర కీలకం అవుతుంది. ఆ సమయంలో మనకున్న డిమాండ్‌ ప్రత్యేక హోదా మాత్రమే. కియా.. వ్యవహారంపై మాట్లాడుతూ, కియా తరలిపోతుందంటూ తప్పుడు వార్త ఇచ్చారు. అనైతికమైన రిపోర్టింగ్‌ చేశారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా వార్తా కథనం ఇచ్చారు.

ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన కథనం ఇది. తాము ఎక్కడికీ వెళ్లడంలేదంటూ కియా వరుసగా ఖండనలు ఇస్తున్నా... వాళ్లు వాస్తవాలు పట్టించుకోవడంలేదు. రాజకీయాలకోసం వ్యవస్థలను మేనేజ్‌చేసి ఏ స్థాయికైనా దిగజారే పరిస్థితి చూస్తున్నాం. నామీద బురదజల్లడం, నిందలు వేయడం ఇప్పడు మొదలుపెట్టింది కాదు. ఇవన్నీ నాకు అలవాటే. నిజాలతో పనిలేకుండా ఒక మనిషికి చెడ్డపేరును ఆపాదించాలని ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కచ్చితంగా మాకు తోడుగా ఉంటాడు.  గతంలో మా పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను  కొనుగోలుచేశారు. ఎన్నికల తర్వాత వారికి వచ్చిన సీట్లు 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే. దేవుడు రాసిన గొప్ప స్క్రిప్టు ఇది. వాళ్లు చేసే కొద్దీ దేవుడు అయ్యో పాపం అంటూ.. మన పక్కనే ఉంటాడు.

2014 నుంచి రాష్ట్రంలో పరిశ్రమలకు రాయితీల రూపంలో చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించలేదు.  ఈ రాయితీలు ఇవ్వకుండా చంద్రబాబు దావోస్‌ వెళ్లాడు, మార్కెటింగ్‌కోసం కోట్లు ఖర్చుచేశాడు. రాష్ట్రంలో నడుస్తున్న పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా మనం అదిచేస్తాం, ఇది చేస్తాం అని ప్రకటనలు చేసీ ఏం లాభం. మా  ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు వేల కోట్ల రూపాయలను చెల్లిస్తున్నాం. పరిశ్రమలకు కావాల్సింది ప్రధానంగా సరసమైన ధరలకు భూములు, నీళ్లు, కరెంటు. అవినీతిలేని పాలన, సానుకూల దృక్పథం ఉన్న ప్రభుత్వం, విధానాల్లో పారదర్శకత. ఇవన్నీ ఉన్న ప్రభుత్వం మాది. పైగా అబద్ధాలు చెప్పే అలవాటు మా ప్రభుత్వానికి లేదు. పరిశ్రమలకు ఇవన్నీ సానుకూల అంశాలు. మిగిలినవన్నీ సహజంగానే వస్తాయి.  విషయాలన్నింటికీ ఎప్పటికప్పుడు మేం చెప్తూనే ఉన్నాం. కాకపోతే మాకు మీడియా బలం తక్కువన్నారు సి.ఎం. .

సీఎంగా అతి పెద్ద సవాల్‌ ఏమి ఉంటుందన్న ప్రశ్నకు,ప్రతిరోజూ సవాలే. మంచి సమర్థతతో ఆ సవాలను అధిగమించాలి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిపారుదల, హౌసింగ్‌... వీటిని ప్రాధాన్యతలుగా పెట్టుకున్నాం. అసలు అభివృద్ధి అంటే ఏమిటి? నాడు– నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లను బాగా అభివృద్దిచేస్తున్నాం? ఇది అభివృద్దికాదా? ఇంగ్లిషు ల్యాబ్‌ సహా 9 రకాల సదుపాయాలను ప్రతిస్కూళ్లలో కల్పిస్తున్నాం. ప్రతి స్కూళ్లో ఇంగ్లిషు మీడియం పెడుతున్నాం.మధ్యాహ్న భోజనంలో నాణ్యత బాగా పెంచాం.  గ్రీన్‌ఛానళ్లో పెట్టి బిల్లులు పెండింగులో లేకుండా చూస్తున్నాం.ఆయాల జీతాలు రూ.వేయి నుంచి రూ.3వేలకు పెంచాం. అమ్మ ఒడి అమలు చేశాం.ఫీజు రియంబర్స్‌మంట్‌ పూర్తిగా ఇస్తున్నాం. పాఠ్యప్రణాళికలో పూర్తిగా మార్పులు తీసుకు వస్తున్నాం. డిగ్రీ విద్యార్థులకు ఏడాదిపాటు అదనంగా అప్రెంటిస్‌ ఇప్పిస్తున్నాం.ఇది అభివృద్ది కాదా, అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ పోలవరం మీద ఎంతో «ధ్యాసపెడుతున్నామని చెప్పిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం ప్రాజెక్టును మిస్‌ హ్యాండిల్‌ చేసిందని, త ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణలో విజన్‌ లోపించిందని చెప్పారు. "స్పిల్‌వే పూర్తికాకుండానే కాపర్‌ డ్యాం నిర్మాణం చేపట్టింది. దీనివల్ల వరదనీరు అటు స్పిల్‌వేగుండా పోవడంవల్ల పనులు చేయలేని పరిస్థితి. నవంబర్‌ వరకూ పనులు నిలిపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2021 జూన్‌ నాటికి పనులు పూర్తవుతాయి," అని వివరించారు.