భయపెడుతున్న కరోనా సెకండ్ వేవ్...  అప్రమత్తమైన తెలంగాణ సర్కార్

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో.. తెలంగాణ లోని కేసీఆర్ సర్కార్ అప్రమత్తమైంది. కరోనా తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న అన్ని పడకలకూ ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పించాలని ఈ భేటీలో నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 22 వేల పడకలు ఉండగా, ప్రస్తుతం 11 వేల పడకలకు మాత్రమే ఆక్సిజన్ సౌకర్యం ఉంది. అంతేకాకుండా వందకు పైగా పడకలు ఉన్న ఆసుపత్రులకు లిక్విడ్ ఆక్సిజన్ ను, మిగిలిన ఆసుపత్రులకు సాధారణ ఆక్సిజన్ ను సరఫరా చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

 

అన్ని ఆసుపత్రుల్లో కలిపి అదనంగా మరో 5 వేల పడకలను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా తొలి దశలో ఎదుర్కొన్న సంక్షోభ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, మరోసారి ఆ పరిస్థితి ఏర్పడకుండా ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి గాంధీ ఆసుపత్రి వరకూ కరోనా చికిత్సలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలనూ సిద్ధంగా ఉంచాలని, అదే విధంగా వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.