టార్గెట్ టీఆర్ఎస్... వచ్చీరాగానే కేసీఆర్పై అమిత్షా బ్రహ్మాస్త్రం
posted on May 23, 2017 11:39AM
2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా తెలంగాణ పర్యటన సాగుతోంది. అమిత్షా వచ్చీరాగానే కేసీఆర్ సర్కార్ను టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలతో మిషన్ తెలంగాణ స్టార్ట్ చేశారు. నల్గొండ జిల్లా తెరెట్పల్లిలో ఇంటింటికీ కలియదిరిగారు. దళితులతో సహపంక్తి భోజనాలు చేశారు. తెరెట్పల్లిలో గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించిన అమిత్షా.... కేసీఆర్ పాలనపై ఏ ఒక్కరూ సంతోషంగా లేరంటూ నిప్పులు చెరిగారు. ప్రజలకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారని టీఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అమిత్ షా ఆరోపించారు.
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలు సరిగా అమలు కావడం లేదన్నారు అమిత్ షా. దేశవ్యాప్తంగా 4కోట్ల మరుగుదొడ్లు కట్టిస్తుంటే.... తెలంగాణలో మాత్రం నిర్మాణాలు జరగడం లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తున్నా... తెలంగాణలో అమలుకు నోచుకోవడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలదేనన్న అమిత్ షా.... తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
నల్గొండ జిల్లా తెరెట్పల్లిలో గ్రామంలో పలువురి ఇళ్లకెళ్లిన కమల దళపతి... ప్రజల సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని గుర్తించిన అమిత్షా.... పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మోడీ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలేదన్నారు. మొత్తానికి మొదటిరోజే కేసీఆర్ ప్రభుత్వాన్ని అమిత్షా టార్గెట్ చేయడంతో.... టీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.