చోటా రాజన్ కు ఎదురుదెబ్బ...రేపు శిక్ష ఖరారు..!
posted on Apr 24, 2017 4:32PM
గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్కు నకిలీ పాస్ పోర్టు కేసులో ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ పాస్ పోర్టు కేసులో ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఛోటా రాజన్ను దోషీగా ప్రకటించింది. రేపు (మంగళవారం) రాజన్కు శిక్షను ఖరారు చేయనున్నట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వీరేందర్ కుమార్ గోయల్ ప్రకటించారు. అంతేకాదు రాజన్ తో పాటు మరో ముగ్గురిని కోర్టు దోషులుగా ప్రకటించింది. పాస్ పోర్టు అధికారులు దీపక్ నట్వర్ లాల్ షా, లలిత లక్ష్మణన్, జయశ్రీ దత్తాత్రేయ్ రహతెలు రాజన్ కు సహకరించారంటూ వారిని కూడా దోషులుగా ప్రకటించింది కోర్టు. కాగా ఫోర్జరీ పత్రాలతో మారుపేరుతో ఛోటా రాజన్ పాస్ పోర్టు పొందినట్టు గతేడాది జూన్ 8న సీబీఐ కోర్టులో అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. హత్యలు, స్మగ్లింగ్, కిడ్నాప్ సహా రాజన్పై 85కు పైగా కేసులున్నాయి.