రాజధాని రచ్చ.. అమరావతి నిర్మాణంపై విపక్షాల సమావేశం

 

ఏపీలో రాజధాని రాజకీయం హీటెక్కింది. రాజధాని అమరావతి నిర్మాణంపై టిడిపి.. వైసిపిలు పోటా పోటీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. విజయవాడలో టిడిపి అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజా రాజధాని అమరావతి పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ కు 17 పార్టీలను.. 22 విభాగాల సంఘాలను కూడా టిడిపి ఆహ్వనించింది. సంపద సృష్టి , పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన అజెండగా సమావేశం ఏర్పాటు చేసినట్టు టిడిపి నేతలు చెబుతున్నారు. టిడిపి నిర్వహించే సమావేశాల్లో రాజధాని పై జగన్ సర్కారు తీరును విమర్శించే అవకాశం ఉంది. అమరావతిలో భూ సేకరణకు సమయం పట్టిందని టిడిపి నేతలు గుర్తు చేసే అవకాశం ఉంది. ఇరవై తొమ్మిది గ్రామాల భూములు తీసుకుని నిధులు వెచ్చించి చేపట్టిన పనులు నిర్మాణాల పై వివరిస్తారు. ఏడాది లోనే ఎక్కువ నిర్మాణాలు పూర్తయ్యాయని టిడిపి నేతలు చెబుతున్నారు. రాజధాని మార్పు పై పూటకోమాట మాట్లాడుతూ ప్రజల్లో అభద్రతా భావం కలిగిస్తున్నారనే విషయం పై కూడా రౌండ్ టేబుల్ సమావేశం దృష్టి పెట్టనుంది. అంతే కాకుండా చంద్రబాబు బస్సు పర్యటన సమయంలో జరిగిన ఆందోళనను ఈ మీటింగ్ లో ప్రస్తావించే అవకాశం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల అభిప్రాయాలను తీసుకొని రాజధాని పై పోరాటాన్ని ఉధృతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

మరోవైపు టిడిపి నిర్వహిస్తున్న ప్రజా రాజధాని అమరావతి మీటింగ్ కు వైసీపీ కౌంటరిస్తోంది. రాజధాని ప్రాంత రైతులు రాజధాని నిజస్వరూపం పేరుతో సదస్సు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. తుళ్లూరులో రాజధా ని అంశంపై వివిధ పార్టీల నేతలు ప్రజా సంఘాలతో ఈ సమావేశం జరుగుతోంది. అమరావతి అసలు కోణం,కుంభకోణం శీర్షికన జరిగే ఈ సమావేశాల్లో అమరావతి పేరుతో గత టిడిపి ప్రభుత్వం చేసిన కుంభకోణాలు భూ దందాలు, అవినీతిపై చర్చిస్తారు. రాజధాని ప్రాంత రైతులకు, రైతు కూలీలకు రాజధానిలో సామన్యులకు జరిగిన అన్యాయం పై సమావేశాల్లో ప్రధానంగా చర్చిస్తారు. అమరావతి లో రాజధానిపై పోటా పోటీ సమావేశాలు రాజకీయాలు చలిలో కూడా వేడి పుట్టిస్తున్నాయి. రాజధాని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యంలో తమ వాదన ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు అధికార విపక్షాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.