మనవడిని కూడా వదిలి వచ్చేశా..
posted on Oct 20, 2017 10:49AM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్య కాలంలో తన మనవడితో కాస్త సమయం కూడా దొరకట్లేదని చాలా సార్లు చెప్పడం విన్నాం. ఇప్పుడు తాజాగా మరోసారి తన మనవడి ప్రస్తావన తీసుకొచ్చారు చంద్రబాబు. అమెరికాలోని డెమోయిన్స్ లో టీడీపీ ఫోరం నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... పుట్టిన నేలను, జన్మభూమిని ఎప్పటికీ మరిచిపోరాదని... మనవడితో దీపావళి పండుగ చేసుకోకుండా... ప్రజల కోసం, మీ కోసం ఇక్కడకు వచ్చానని చెప్పారు. గతంలో తాను చేసిన చిన్న ప్రయత్నంతో మీరంతా ఇక్కడకు వచ్చారని చెప్పారు. ఆనాడు 30 ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్యను 300కు పెంచానని... దీంతో, అందరూ ఉన్నత విద్యలను పూర్తిచేసి, మంచి అవకాశాలను అందుకున్నారని తెలిపారు. ఇక్కడున్నవారంతా మంచి స్థాయిలో ఉన్నారని... ప్రస్తుత స్థాయితో తృప్తి పడకూడదని, మరింత ఎత్తుకు ఎదగడానికి ప్రయత్నించాలని సూచించారు.