నానీ కూడా వచ్చాడంటే చంద్రబాబు గ్రేటే...
posted on Sep 13, 2017 11:13AM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు "ఇంటింటికీ టీడీపీ" అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తో పలువురు టీడీపీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల్ని కలుసుకొని..వారి సమస్యలను తెలుసుకొని.. వారికి భరోసా ఇస్తున్నారు. అయితే ఓ టీడీపీనేత మాత్రం హాట్ టాపిక్ గా మారాడు. ఎవరా నేత..? ఎందుక హాట్ టాపిక్ అయ్యాడు అనుకుంటున్నారా..? అతనెవరో కాదు టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాసరావు.. అతనే కేశినేని నాని అంటే అర్ధమవుతుంది.
ఎందుకు కేశినేని నానినే హాట్ టాపిక్ గా మారాడు అని డౌట్ కదా... ఎందుకంటే.. బేసిక్ గా నాని ఎవరిమాటా వినడు... నేను మోనార్క్ ను.. వ్యక్తిగతంగా ఎవరికీ తలవొంచని మనస్తత్వం. నువ్వు నాకు చెప్పదేంటి? ఈ పదవి ఉంటే ఎంత? పోతే ఎంత? అనే టైపులో ఉంటాడు. అందుకే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా.. 50 ఏళ్లుగా ఉన్న ట్రావెల్స్ వ్యాపారాన్ని నిలిపివేశాడు. అందరూ ఆశ్చర్యపోయినా, వద్దని మొత్తుకున్నా.. కూడా నాని ఎవ్వరి మాటా వినలేదు. ఇక, పెద్దగా నడవడం ఇష్టం లేని, ఆరోగ్యం పరంగా సహకరించని నాని ఇప్పుడు చంద్రబాబు చేపట్టిన కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన నియోజక వర్గంలోని ప్రజలను కలిసి పలకరించారు. దీంతో ఇప్పుడు ఇది చర్చకు దారితీసింది. నాని ఏంటీ బయటకు రావడం ఎంటీ.. అని షాకవుతున్నారు. అంతేకాదు నాని వచ్చి ప్రతిపక్ష పార్టీల నోరు మూయించారు అని అనుకునే వారు కూడా ఉన్నారు. పార్టీలో బాబుకు పట్టులేదని, నేతలు ఎవరిదారి వాళ్లే చూసుకుంటున్నారని, బాబు పట్టుకోల్పోయారని నిన్నమొన్నటి వరకు వైసీపీ నేతలు చెవిరెడ్డి, రోజాల వంటివారు ఆడిపోసుకునేవారు. దీంతో ఇప్పుడు నాని బయటకు వచ్చి వాళ్ల నోరు మూయించారు అని అంటున్నారు. మొత్తానికి నాని కూడా బయటకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు అంటే చంద్రబాబు సక్సెస్ అయినట్టే.