ఏపీకి కొత్త గవర్నర్ వస్తున్నారా..!

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించిన తరువాత బీజేపీ అధిష్టానం మంచి దూకుడు మీద ఉంది. ఎలాగైనా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి 2024 లో వచ్చే ఎన్నికలలో జనసేనతో కలిసి అధికారాన్ని చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు పార్టీ స్టాండ్ దాటిన వారిని కూడా ఏమాత్రం క్షమించకుండా ఇమీడియట్ గా పార్టీ నుండి సస్పెండ్ చేసేస్తున్నారు.

 

దీనికి తోడు తాజాగా ఏపీలో కొత్త గవర్నర్ వస్తారని.. ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ని తప్పించబోతున్నట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ కొద్ది రోజుల క్రితం తమను సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయాల పై అసంతృప్తిగా ఉన్న కేంద్రం ఆయనను మార్చేందుకు రంగం సిద్దం చేసిందని లేటెస్ట్ టాక్. మరీ ముఖ్యంగా నిమ్మగడ్డ ప్రసాద్ నియామకం అంశం, మూడు రాజధానుల బిల్లుల ఆమోదం వంటి అంశాలపై కేంద్రాన్ని సంప్రదించకుండా గవర్నర్ వ్యవహరించిన తీరుతో రాష్ట్రంలో ఎదగాలన్న పార్టీ ఆశయానికి గండి పడిందని అంతేకాక ఈ నిర్ణయాలు అటు కేంద్రాన్ని కూడా ఇరుకున పెట్టాయని అందుకే ఆయనను తప్పించి ఆయన స్థానంలో వేరే వారిని నియమించాలని బీజేపీ భావిస్తున్నట్టుగా వినికిడి. 

 

అయన స్థానంలో వచ్చే కొత్త గవర్నర్ సెలెక్షన్ కూడా ఇప్పటికే అయిపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పాండిచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా పని చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీనీ నియమిస్తే అటు సీఎం జగన్ దూకుడుకు కూడా కళ్ళెం వేయవచ్చు అని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. అయితే ఈ ప్రచారం ఎంతవరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.