పొరపాటున బీజేపీకి ఓటేశానని వేలు నరుక్కున్నాడు
posted on Apr 19, 2019 12:36PM
సాధారణంగా ఓటేయడానికి పోలింగ్ బూత్కి వెళ్తే.. మనం అనుకున్న పార్టీకి ఓటేసి ఆనందంగా బయటికి వస్తాం. కంగారులో పొరపాటున ఒక పార్టీకి ఓటేయబోయి వేరే పార్టీకి ఓటేస్తే.. అయ్యో ఎంత పనైంది అంటూ కాస్త బాధపడతాం. కానీ ఓ వ్యక్తి మాత్రం పొరపాటున ఒక పార్టీకి ఓటేయబోయి మరో పార్టీకి ఓటేసినందుకు ఏకంగా తన చేతి వేలుని నరుక్కున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని బులంద్శహర్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బోలా సింగ్ పోటీ చేస్తున్నారు. అలాగే ఎస్పీ-బీఎస్పీ కూటమి తరపున యోగేశ్ వర్మ బరిలోకి దిగారు. రెండో దశ పోలింగ్లో భాగంగా ఈ నియోజకవర్గానికి గురువారం ఎన్నికలు జరిగాయి. అబ్దుల్లాపూర్ హులసన్ గ్రామానికి చెందిన పవన్ కుమార్ అనే బీఎస్పీ మద్దతుదారు.. యోగేశ్ వర్మకు ఓటు వేయాలని నిశ్చయించుకొని వెళ్లాడు. కానీ ఈవీఎం దగ్గరికి వెళ్లాక పొరపాటున బీజేపీకి ఓటేశాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన పవన్ కుమార్ ఆవేశంలో వేలుకి ఉన్న సిరా మరక వరకు వేలుని నరికేసుకున్నాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపంగానే వేలును నరికేసుకున్నానని చెబుతూ ఓ వీడియోను కూడా విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.