బొత్సకు అక్షింతలు పడ్డాయా? అందుకే వివరణ ఇచ్చుకున్నారా?

 

రాజధాని అమరావతిపై వివాదం చెలరేగడంతో మంత్రి బొత్స తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. పీపీఏల సమీక్ష, రివర్స్ టెండరింగ్, పోలవరం కాంట్రాక్టు రద్దుపై ఎదురుదెబ్బలు తగలడం... కేంద్రం నుంచి మొట్టికాయలు పడటం... మరోవైపు నలువైపుల నుంచి ప్రభుత్వాన్ని వివాదాలు చుట్టుముట్టడం... అదే సమయంలో రాజధాని వివాదం రాజుకోవడంతో... సీఎం జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. జగన్ నుంచి అక్షింతలు పడటంతోనే, బొత్స తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారనే మాట వినిపిస్తోంది. దాంతో మీడియాతో చిట్ చాట్ చేసిన బొత్స... రాజధానిని మారుస్తున్నామని తాను ఎక్కడా అనలేదన్నారు. అమరావతిలో నిర్మాణ వ్యయం పెరుగుతుందని చెప్పానే తప్ప... రాజధానిని మారుస్తున్నారని చెప్పలేదని బొత్స వివరణ ఇచ్చుకున్నారు.

రాజధానిపై తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని బొత్స మండిపడ్డారు. అమరావతి విషయంలో శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్‌ను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని మాత్రమే తాను చెప్పానని బొత్స చెప్పుకొచ్చారు. అలాగే, అమరావతిలో వరదల గురించే తాను మాట్లాడానన్న బొత్స... రాజధాని విషయంలో శివరామకృష్ణ నివేదికను కాకుండా, నారాయణ రిపోర్టునే చంద్రబాబు అమలు చేశారని బొత్స సెటైర్లు వేశారు. స్వార్థం, స్వలాభం కోసమే బాబు అలా చేశారని ఆరోపించారు. 

చంద్రబాబు రియల్ ఎస్టేట్‌ వ్యాపారిలా మాట్లాడుతున్నారని బొత్స మండిపడ్డారు. అమరావతి చుట్టూ టీడీపీ నేతల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నందునే వాళ్లంతా భయపడుతున్నారని అన్నారు. అయితే తాము అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ రాజధాని పేరుతో జరిగిన అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమని బొత్స అన్నారు. ఏదిఏమైనా ఒక్క ప్రాంతం మాత్రమే కాకుండా, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు. మొత్తానికి రాజధాని అమరావతి వివాదంపై హైకమాండ్ నుంచి అక్షింతలు పడటంతోనే బొత్స వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది.