ప్రధాని పీఠం కోసం.. ఓ కేంద్రమంత్రి క్షుద్రపూజలు...

మనుషులు తాము అనుకున్న దానిని సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు.. ఇంత శ్రమించినా... ఫలితం దక్కకుంటే.. అందుకు వేర్వేరు మార్గాలు వెతుకుతారు. వీలైతే రాజమార్గం లేదంటే దొడ్డి దారిలో వెళ్లైనా సరే లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో దేవుడిని నమ్మేవారు కొందరైతే.. అతీత శక్తుల అండతో అగ్రస్థానాలను చేరుకోవాలనే వారు మరికొందరు. ఇందులో ఎంతవరకు వాస్తవముందో తెలియదు కానీ.. వీటిని నమ్మే వారు నేటి సాంకేతిక యుగంలోనూ ఎక్కువవుతున్నారు. ఈ అతీత శక్తులను నమ్మిన ఓ కేంద్ర మంత్రివర్యులు తనకు రాజయోగం కలగాలని కోరుతూ పూజలు జరిపించారట. రాజయోగమంటే ఏదో కాదు.. దేశంలోని అత్యున్నత పదవి.. దేశానికి రాజు లాంటి ప్రధానమంత్రి పదవి కోసమే.

 

కేంద్ర మంత్రివర్గంలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ మంత్రిగారికి.. ఎన్డీఏలోని పెద్దలందరితో సన్నిహిత సంబంధాలున్నాయట. నిధుల కోసం పార్లమెంట్‌ వేదికగా పోరాటం చేస్తున్న ఏపీకి ఈయనగారు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రిత్వ శాఖ నుంచే ఫండ్స్‌ వస్తున్నాయట. సీనియర్ రాజకీయవేత్తగా ఎన్నో హోదాల్లో పనిచేసిన ఆయన చూపు ప్రస్తుతం ప్రధాని పీఠంపై ఉందట. అయితే అది అంత తేలికకాదని ఆయనకి తెలుసు.. అందుకే అతీత శక్తుల సాయంతో తన పని చేసుకోవాలని భావించి.. తెలుగు రాష్ట్రాల్లోని ఓ స్వామిజీని ఆశ్రయించాడట.

 

అతను అలాంటి.. ఇలాంటి వ్యక్తి కాడట.. అప్పట్లో కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన నేతకు పూజలు చేసిన అనుభవం ఉందట. సాక్షాత్తూ కేంద్రమంత్రి అంతటి వ్యక్తి తనను నమ్మి వస్తే.. ఆ స్వామిజీ గారు ఊరుకుంటారా..? ఆయన గారిని సింహాసనం ఎక్కించడానికి ఏ పూజలు చేయాలో.. అవి చేసేశారట. అయితే సదరు స్వామిజీ గారి చేత గతంలో పూజలు చేయించుకున్న ముఖ్యమంత్రి తర్వాత జరిగిన ఎన్నికల్లో.. పదవిని.. తన ఛరిష్మాను కోల్పోయి ప్రస్తుతం సోదీలో లేకుండా పోయారు. మరి ఆ విషయం తెలిసి కూడా కేంద్రమంత్రిగారు ఆ స్వామిజీని ఎందుకు నమ్మారంటే..? పదవి మీద మోజు.. అదొక్కటి చాలు. ఏదైనా జరగడానికి..!!